తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జగన్నాధపురం రైతు వేదికలో విత్తన మేళా ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అంకిత్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం జూన్ 23 నుంచి 30వ తేదీ వరకు ప్రతి మండలంలో నిర్వహిస్తున్న విత్తన మేళాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. మంగళవారం పాల్వంచ మండలం జగన్నాధపురం రైతు వేదికలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మేళాలో ఏర్పాటు చేసిన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి, విత్తనాల ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి వాటి ప్రామాణికతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని రకాల ధ్రువీకరించిన, నాణ్యమైన విత్తనాలను ఒకే వేదికపై సరసమైన ధరలకు అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. రైతు వేదికలలో నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాల్లో సన్న రకాల వరి విత్తనాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విత్తనాలతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక వ్యవసాయ ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. జిల్లాలోని 43 రైతు వేదికల ద్వారా విత్తన మేళాలు నిర్వహిస్తున్నామని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేలా చర్యలు చేపట్టామని తెలిపారు. యూరియా బుకింగ్ను కూడా యాప్ ద్వారా నిర్వహిస్తున్నామని, రైతులు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. యూరియా బుకింగ్ యాప్, విత్తనమేలపై రైతులలో అవగాహన కలిగించాలని వ్యవసాయ శాఖ అధికారులని ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయం, విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలించడం వంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, వ్యవసాయ అవసరాలన్నీ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. రైతులు నాణ్యమైన విత్తనాలను వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం విత్తన మేళా ద్వారా విత్తనాలు కొనుగోలు చేసిన రైతులకు, యూరియా బుకింగ్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులకు కలెక్టర్ చేతులమీదుగా విత్తనాలు, యూరియా అందించారు. ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, సోసిటీ ఛైర్మెన్ కొత్వాల శ్రీనివాస్, తాసిల్దార్ ధారా ప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ