తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నైపుణ్యాభివృద్ధితో యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ వారం కార్యక్రమాలలో భాగంగా పాల్వంచలో శుక్రవారం నవ ఒకేషనల్ లో నైపుణ్యాభివృద్ధి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ కేంద్రంలో జరుగుతున్న కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ పొందుతున్న మహిళలు, పురుషులతో కలెక్టర్ ప్రత్యక్షంగా మట్లాడి వారికి అందుతున్న శిక్షణ నాణ్యత, శిక్షణ కాలవ్యవధి, శిక్షణ అనంతర ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల మార్కెటింగ్ విధానాలు, ఆదాయ సాధన అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. శిక్షణార్థుల అభిప్రాయాలను తెలుసుకుని, శిక్షణను మరింత ఫలప్రదంగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా 2010లో స్థాపించబడిన “నవ భారత్ వొకేషనల్ ఇనిస్టిట్యూట్” ద్వారా పరిసర ప్రాంతాల పేద యువతకు వెల్డింగ్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, సోలార్ టెక్నీషియన్ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో నాణ్యమైన ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఇప్పటివరకు 2200 మందికి స్టైఫండ్తో కూడిన శిక్షణ అందించగా, ప్రస్తుత సంవత్సరంలో 80 మందికి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. శిక్షణ పొందిన అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలతో పాటు ప్రైవేటు సంస్థల్లో, అలాగే విదేశాల్లో కూడా ఉపాధి పొందడం గర్వకారణమని కలెక్టర్ అన్నారు . కొంతమంది స్వయం ఉపాధి ద్వారా తమ జీవనోపాధిని స్థిరపరచుకోవడం ప్రోత్సాహకరమని అన్నారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో వృత్తి విద్య కు ఉన్న ప్రాధాన్యతను యువత సరిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదాయ విద్యతో పాటు వృత్తి నైపుణ్యాలు కలిగి ఉంటేనే ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని తెలిపారు. కేవలం డిగ్రీలు పొందడం సరిపోదని, ఉద్యోగ రంగం అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ స్కిల్స్ను అభ్యసించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రస్తుతం పరిశ్రమలు, సర్వీస్ రంగాలు నైపుణ్యంతో కూడిన సిబ్బందిని కోరుకుంటున్నాయని, వెల్డింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఫిట్టింగ్, సోలార్ టెక్నాలజీ, మెషిన్ ఆపరేషన్, డిజిటల్ సర్వీసులు వంటి రంగాల్లో శిక్షణ పొందిన వారికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ కోర్సులు తక్కువ కాలంలో నేర్చుకునే వీలుతో పాటు త్వరగా ఉపాధి పొందే అవకాశం కల్పిస్తాయని తెలిపారు. వృత్తి విద్య కేవలం ఉద్యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా స్వయం ఉపాధికి కూడా బలమైన మార్గం చూపుతుందని అన్నారు. శిక్షణ పొందిన యువత చిన్న స్థాయిలో యూనిట్లు ప్రారంభించి క్రమంగా వ్యాపారాలను విస్తరించుకోవచ్చని, దీనివల్ల ఇతరులకు కూడా ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని . ప్రపంచ స్థాయిలో జపాన్, రష్యా వంటి దేశాలు వృత్తి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పారిశ్రామిక అభివృద్ధి సాధిస్తున్నాయని, అదే విధంగా మన దేశంలో కూడా నైపుణ్యాభివృద్ధి ద్వారా ఆర్థిక పురోగతిని సాధించవచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కిల్ డెవలప్మెంట్ పథకాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలు, పథకాలను సమర్థవంతంగా వినియోగించుకుని యువత స్వయం ఉపాధి సాధించి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చేతివృత్తులకు గౌరవం పెంచుకుని చిన్న స్థాయిలో ప్రారంభించిన వ్యాపారాలను క్రమంగా అభివృద్ధి చేసుకుంటే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సదుపాయాలతో ఏటీసీ కేంద్రాల ద్వారా వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యం సాధించేలా విస్తృత కార్యక్రమాలు చేపడుతోందని, సంప్రదాయ కోర్సులతో పాటు సోలార్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ పొందడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు పొందవచ్చని సూచించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేయడంతో పాటు, చేతివృత్తుల ద్వారా గత నెలలో సాధించిన ఆదాయానికి గుర్తింపుగా చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఓ సంజీవరావు, తహసీల్దార్ ధారా ప్రసాద్, నవ భారత్ వొకేషనల్ ఇనిస్టిట్యూట్ హెచ్ఆర్ శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, బీసీ సంక్షేమ శాఖ అధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి ఉపేందర్, ఏపీఎం వెంకయ్య, మహిళా సాధికారిక ప్రతినిధులు, నవ ఒకేషనల్ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ