తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజల సమస్యల పరిష్కారంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వినతులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐ డి ఓ సి కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి కలెక్టర్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ విద్యచందన తో కలిసి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న వ్యక్తిగత, సామూహిక సమస్యలను శ్రద్ధగా విని, ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిగణించి సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం ద్వారా సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. వెంటనే పరిష్కరించగల అంశాలను ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం లేదా జాప్యం చోటుచేసుకోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. ప్రతి సమస్య వెనుక ఉన్న మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని, ప్రజా సేవలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యంత అవసరమని కలెక్టర్ అన్నారు . ప్రజలు తమ వినతులతో పాటు అవసరమైన ఆధార పత్రాలను సమర్పిస్తే సమస్యల పరిష్కారం మరింత వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజావాణిలో అందిన పలు వినతులను పరిశీలించిన కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యల నిమిత్తం ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తు : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన వేపల లక్ష్మి తాను ఇంజినీరింగ్ పూర్తి చేశానని, భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, ఇద్దరు పిల్లల సంరక్షణ బాధ్యత తనపై ఉందని పేర్కొంటూ అంగన్వాడీ కేంద్రంలో టీచర్ పోస్టు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ ఉపాధి కల్పన అధికారికి తగు చర్యల నిమిత్తం ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధికి చెందిన షేక్ సఫియా తాము నివాసం ఉంటున్న ఇల్లు శిథిలావస్థకు చేరుకుందని, వర్షాకాలంలో వర్షపు నీరు ఇంట్లోకి చేరుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ గృహ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్కు తగు చర్యల నిమిత్తం ఎండార్స్ చేశారు. దమ్మపేట మండలం మల్లారం మోడల్ కాలనీకి చెందిన మోదంపరుపు సత్యవతి తాము నిరుపేద కుటుంబానికి చెందినవారమని, కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమకు ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలని కోరుతూ సమర్పించిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్కు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం రామచంద్రునిపేట గ్రామపంచాయతీకి చెందిన గ్రామస్తులు తమ గ్రామ పరిధిలోని చెరువులు, వాగుల్లో చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్నామని తెలిపారు. గతంలో గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఉమ్మడి గ్రామపంచాయతీ పేరుతో కొనసాగిందని, నూతన గ్రామపంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో రామచంద్రునిపేట గ్రామపంచాయతీ ఏర్పడినందున ఆ గ్రామపంచాయతీ పేరుతో కొత్త మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి మంజూరు చేయాలని కోరారు. ఈ వినతిని పరిశీలించిన కలెక్టర్ జిల్లా మత్స్యశాఖ అధికారికి తగు చర్యల నిమిత్తం ఎండార్స్ చేశారు. పాల్వంచలోని టీజీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలో పార్ట్టైమ్ తెలుగు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న విజయనిర్మల, పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఆరుగురు విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదనే కారణంతో తనను విధుల నుండి తొలగించారని పేర్కొన్నారు. జిల్లాలోని ఇతర పాఠశాలల్లో ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులను తొలగించలేదని, తనకు న్యాయం చేసి తిరిగి విధుల్లో కొనసాగేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత ఆర్సీఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ