తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆధునీకరణ చర్యలు అత్యవసరమని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఆయన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రి సేవల నాణ్యతను మరింత మెరుగుపరచేందుకు అవసరమైన ఆధునీకరణ చర్యలు, సాంకేతిక పరిజ్ఞానం, వైద్య పరికరాల అవసరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆపరేషన్ థియేటర్ విభాగాన్ని పరిశీలించి, ఆధునీకరణ కోసం అవసరమైన అత్యాధునిక పరికరాలు, సాంకేతిక వినియోగం, ప్రస్తుత సదుపాయాల బలోపేతం వంటి అంశాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బందితో చర్చించారు.ఆసుపత్రి భవనం పైభాగంలో నీటి లీకేజ్ సమస్యను గమనించిన కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను పిలిచి వెంటనే లీకేజీ నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఆయన ప్రసూతి విభాగం, శిశు సంరక్షణ విభాగం, అత్యవసర వైద్య విభాగం, వార్డులను సందర్శించి పరిశుభ్రత, వైద్య సదుపాయాలు, రోగుల సేవా ప్రమాణాలను పరిశీలించారు. అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో కలెక్టర్ మాట్లాడుతూ —“ఆసుపత్రి ఆవరణం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రతలో నిర్లక్ష్యం చోటు చేసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి. పరిశుభ్ర వాతావరణంలోనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుంది,” అని సూచించారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా యూనిఫార్మ్లు ధరించాలని, అవసరమైతే వారందరికీ యూనిఫార్మ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మరియు వైద్య సిబ్బంది నర్సుల కొరతను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ కొత్తగూడెం జిల్లా ప్రధాన ఆసుపత్రి (GGH) నుండి తాత్కాలికంగా నర్సులను నియమించడానికి అధికారులను ఆదేశించారు. ఖాళీగా ఉన్న నర్స్ పోస్టులను భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇటీవల సిఎంఆర్ (CMR) బృందం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అందిస్తున్న సేవలను ప్రశంసించిందని, ఈ విజయానికి కృషి చేసిన వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బందిని కలెక్టర్ అభినందించి సన్మానించారు.జిల్లా ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి ఆదర్శంగా నిలవాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఆధునీకరణ దిశగా ముందుకు సాగాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఓ రవిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య విభాగాధికారులు, మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ