తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ మండలం తోగ్గూడెం మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పరిశీలించి ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాంట్ లో గ్రిడ్ నుండి నీటి ప్రవాహం, నీటి నిల్వ సామర్థ్యం, రోజువారి మండల డిమాండ్, గ్రామాల వారిగా నీటి సరఫరా స్థితిగతులను తదితర అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్లో వివిధ దశల్లో అమలవుతున్న నీటి శుద్ధి ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ప్రతి దశలో చేపడుతున్న పరీక్షలు, శుద్దీకరణ పద్ధతులు మరియు ల్యాబ్ పరీక్షల ప్రమాణాలను గురించి అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్లాంట్ నిర్వహణలో ఉన్న సాంకేతిక పరికరాలు, ఫిల్టర్ల పనితీరు మరియు కెమికల్ డోసింగ్ గురించి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలంలో నీటి కాలుష్యం పెరుగుతుందని దానికి అనుగుణంగా, నీటి శుద్ధి పరీక్షలు నిర్వహించి పరిశుభ్రమైన నీరు సరఫరా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. వాటర్ ఫిల్టర్ బెడ్ భవనం పైన సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని దానికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటర్ ప్లాంట్ ఆవరణంలో ఖాళీ ప్రదేశం అధికంగా ఉన్నందువలన ఆదాయాన్ని చేకూర్చే మొక్కలను నాటాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ నలిని, పాల్వంచ తాసిల్దార్ ధారా ప్రసాద్, మిషన్ భగీరథ గ్రిడ్ డి ఈ సాయి, ఏఈ వెంకటేష్ మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ