తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ డి ఓ సి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ పీడీ రవీంద్రనాథ్తో కలిసి ప్రజల నుండి వచ్చిన వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి వినతిపత్రాన్ని శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పరిష్కరించగల అంశాలను అక్కడికక్కడే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి ఫిర్యాదులోని మూల సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ఆదేశించారు. ప్రజలు తమ వినతులను పూర్తి వివరాలతో పాటు అవసరమైన ఆధార పత్రాలతో సమర్పిస్తే పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందని కలెక్టర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి ఫిర్యాదుకు సమర్థవంతమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తులు: భద్రాచలంలో నివాసముంటున్న జనగాం సుజల అనే ఒంటరి మహిళ తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనకు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారని, తెలంగాణ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షలో తన కుమారుడు ప్రవీణ్ ప్రణీత్ భూషణ్ అర్హత సాధించలేదని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యల కారణంగా ఇద్దరు పిల్లలను చదివించే పరిస్థితి లేదని తెలుపుతూ,తన కుమారుడికి జిల్లాలోని ఏదైనా గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం ట్రైబల్ వెల్ఫేర్ ఆర్సీఓకు పంపించారు. చర్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొంగూరి పల్లవి తాను ఇంటర్మీడియట్ వరకు చదివి, ఎంఫిహెచ్డబ్ల్యూ పూర్తి చేసి, ఏఎన్ఎం అప్రెంటిస్ కూడా పూర్తిచేశానని తెలిపారు . తనకు ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఏఎన్ఎం ఉద్యోగం కల్పించాలని కోరుతూ చేసిన దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి, తగు చర్యల కోసం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి పంపించారు. చర్ల మండలం ఆర్. కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలో నివాసముంటున్న కొమరం భద్రయ్య (తండ్రి: వీరస్వామి) తమకు ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రంతో 4.14 ఎకరాల భూమి ఉన్నదని తెలిపారు. అయితే హక్కు పత్రంలో తన ఫోటో స్థానంలో వేరే వ్యక్తి ఫోటో నమోదైందని, సమస్యను పరిష్కరించి సరిచేయాలని కోరారు. ఈ దరఖాస్తును కలెక్టర్ పరిశీలించి, తగు చర్యల కోసం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి పంపించారు. పాల్వంచకు చెందిన మంగళగిరి నాగమ్మ (తండ్రి: బుచ్చమ్మ) తమకు సర్వే నెంబర్ 817/36లో భూమి ఉన్నదని, అయితే భూభారతి ఆన్లైన్లో అది నిషేధిత భూమిగా చూపబడుతోందని తెలిపారు. సమస్యను పరిష్కరించి నిషేధిత భూముల జాబితా నుండి తొలగించాలని కోరారు. ఈ దరఖాస్తును కలెక్టర్ ధరణి అధికారులకు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూలూరుపాడు మండలం బేతాళపాడు గ్రామ శివారులో నివాసముంటున్న గుగులోత్ రాందాస్ (తండ్రి: సోమ్లా) తమకు ఉన్న పట్టా భూమిలో చేపల చెరువు నిర్మాణం కోసం మత్స్యశాఖ పథకం కింద ఆర్థిక సహాయం మంజూరు చేయాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం జిల్లా మత్స్యశాఖ అధికారికి పంపించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ