తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును మరింత పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు.2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశం శనివారం ఐడీఓసీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షత వహించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ లీడ్ బ్యాంక్ మేనేజర్, నాబార్డ్ ప్రతినిధులు, వివిధ వాణిజ్య బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.సమావేశంలో ప్రాధాన్యతా రంగ రుణాల లక్ష్యాలు, సాధనపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2026 మార్చి 31 నాటికి జిల్లాలో మొత్తం ప్రాధాన్యతా రంగంలో రూ.4,945.28 కోట్ల లక్ష్యానికి గాను రూ.5,201.20 కోట్లు మంజూరు చేసి 105.18 శాతం సాధన నమోదైనట్లు వెల్లడించారు.వ్యవసాయ రంగంలో రూ.3,899.28 కోట్ల లక్ష్యానికి గాను రూ.4,351.34 కోట్లు మంజూరు చేసి 111.59 శాతం సాధన నమోదైంది. ఇందులో పంట రుణాల కింద రూ.2,291.82 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,884.65 కోట్లు (82.20 శాతం), అగ్రి టర్మ్ లోన్స్ కింద రూ.1,416.09 కోట్ల లక్ష్యానికి గాను రూ.1,622.20 కోట్లు (114.55 శాతం), అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.31.41 కోట్ల లక్ష్యానికి గాను రూ.19.09 కోట్లు (58.71 శాతం), అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కింద రూ.159.97 కోట్ల లక్ష్యానికి గాను రూ.825.40 కోట్లు (515.97 శాతం) మంజూరు చేసినట్లు వివరించారు.ఎంఎస్ఎంఈ రంగంలో రూ.847.80 కోట్ల లక్ష్యానికి గాను రూ.703.88 కోట్లు మంజూరు చేసి 83.02 శాతం సాధన నమోదైంది. విద్యా రుణాల కింద రూ.25.39 కోట్ల లక్ష్యానికి గాను రూ.11.21 కోట్లు (44.15 శాతం), గృహ రుణాల కింద రూ.233.62 కోట్ల లక్ష్యానికి గాను రూ.255.22 కోట్లు (109.25 శాతం) మంజూరు చేసినట్లు తెలిపారు. సామాజిక మౌలిక వసతుల రంగంలో రూ.3.30 కోట్ల లక్ష్యానికి గాను రూ.0.34 కోట్లు మాత్రమే మంజూరు కావడంతో 10.30 శాతం సాధన నమోదైందన్నారు.ఈ సందర్భంగా రైతు రుణాల పంపిణీ అంశంపై బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంట రుణాల పంపిణీ లక్ష్య సాధన తక్కువగా ఉన్న బ్యాంకుల అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తమ రుణాలను సకాలంలో పునరుద్ధరించుకునేలా విస్తృత అవగాహన కల్పించాలని, వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్లను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, రైతు భరోసా, ఆసరా పింఛన్లు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే నిధులను ఇతర రుణాల బకాయిల పేరుతో నిలుపుదల చేయరాదని బ్యాంకు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ రంగం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అర్హులైన రైతులు, యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన రుణ సహకారం అందించాలని అన్నారు . జిల్లాలో ఉపాధి, ఆర్థికాభివృద్ధికి దోహదపడే విధంగా బ్యాంకులు రుణాల పంపిణీలో మరింత చొరవ చూపాలని సూచించారు.పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.3.24 కోట్ల లక్ష్యానికి గాను రూ.18.73 కోట్లు మంజూరు చేసి 578.09 శాతం సాధన నమోదవడం సానుకూల పరిణామమని కలెక్టర్ అన్నారు . ఇతర విభాగాల్లో రూ.152.35 కోట్ల లక్ష్యానికి గాను రూ.86.62 కోట్లు మంజూరు చేసి 56.86 శాతం సాధన నమోదైనట్లు తెలిపారు.స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానం, నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) తగ్గింపు, ప్రభుత్వ ప్రాయోజిత పథకాలైన పీఎం స్వనిధి, పీఎంఈజీపీ, పీఎం ముద్ర, పీఎం విశ్వకర్మ, పీఎంఎఫ్ఎంఈ, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఏఐఎఫ్) అమలుపై సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం 2026-27 ఆర్థిక సంవత్సరానికి భారతీయ స్టేట్ బ్యాంక్ రూపొందించిన జిల్లా వార్షిక రుణ ప్రణాళికను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. రూ.8,914 కోట్ల లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.4,593 కోట్లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగానికి రూ.889 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగాలకు రూ.221 కోట్లు, ఇతర రంగాలకు రూ.3,211 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, , జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారులు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్ ఖాన్, రిజర్వ్ బ్యాంక్ అధికారులు, నాబార్డ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ