తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యం సమిష్టి పోరాటాలతోనే సింగరేణిని రక్షించుకుందాం కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి యూనియన్ ప్రతినిధులు తమ బాధ్యతలను విస్మరించొద్దు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ట్రేడ్ యూనియన్ శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు, గుర్తింపు సంఘం వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం, గౌతంపూర్ సింగరేణి కమ్యూనిటీ హలో ఏర్పాటు చేసిన కొత్తగూడెం ఏరియా యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలకు ట్రేడ్ యూనియన్ శిక్షణాతరగతులను సోమవారం అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు నిర్వీర్యమవుతున్నాయని, వాటి పరిరక్షణకు ఉద్యమాలే శరణ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగానికి తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థపై కేంద్రం కన్నేసిందని, ప్రైవేటీకరణవైపు పరుగులుపెట్టిస్తోందని, ఈ పరిస్థితిలో సమిష్టి పోరాటాలతో సింగరేణిని రక్షించుకుందామని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్మికుల సంక్షేమం, కార్మికవాడలు, ప్రభావిత ప్రాంతాల అభివృధ్ధికోసం సింగరేణి యాజమాన్యంపై వత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. యూనియన్ ప్రతినిధులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో తమ బాధ్యతలను విస్మరించొద్దని, నిరంతరం కార్మికులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు అండగా నిలవాలని ఆయన సూచించారు. వర్తమాన పరిస్థితుల్లో కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంపై సమగ్రంగా వివరించారు. కులం–వర్గం–వర్గపోరాటాలు–సామాజిక న్యాయం, అంశంపై సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడారు. 'కార్మికవర్గం ఎదుర్కొంటున్న సవాళ్లుపై యూనియన్ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ ప్రసంగించగా, చారిత్రిక భౌతికవాదం అంశాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు సింగ్ నర్సింహారావు వివరించారు. అనంతరం వి.మల్లికార్జునరావు లేబర్ కోడ్లపై ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వీరస్వామి, రమణమూర్తి, సముద్రాల సుధాకర్, క్రిస్టోఫర్, గట్టయ్య, సూర్య ప్రకాష్, సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హుమాయూన్, హీరాలల్, గుమ్మడి వీరయ్య, భూక్యా రమేష్, ఏం ఆర్ కే ప్రసాద్, మధుకృష్ణ, కమల్, కిషోర్, చారి, భీమయ్య, అప్పారావు, బండారి మల్లయ్య, రాజేశ్వరరావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ