తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ భూమిపైన సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైందని, ప్రకృతి మాతను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని, ప్రముఖ ప్రకృతి కవి రచయిత డాక్టర్. జయరాజ్ అన్నారు.విజ్ఞాన దర్శని, దీ నెహ్రూ సెంటర్, నేచర్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన విజ్ఞాన యాత్రలో భాగంగా, యాత్ర బృందం శనివారం కొత్తగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకృతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన ప్రకృతి ప్రేమికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనేక పోరాటాల త్యాగ ఫలితంగా స్వాతంత్రం సిద్ధించిందని, దాన్ని సఫలీకృతం చేసేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించారనీ వెల్లడించారు. ఇటీవల రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర జరుగుతుందని దాన్ని అర్థం చేసుకుని, రాజ్యాంగ రక్షణకు పాటుపడాలని కోరారు. ప్రపంచంలో క్యాన్సర్ వీరవిహారం చేస్తున్నదని, ప్రాణాంతకమైన క్యాన్సర్ని రూపుమాపేందుకు మనమందరం నిత్యజీవితంలో ప్లాస్టిక్ ని రూపు మాపాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రకృతి పైన, రాజ్యాంగం పైన, సైన్స్ పైన, అవగాహనను కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని, దాని దానిలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు, ప్రజా వైజ్ఞానికవేత్త రమేష్ మాట్లాడుతూ సైన్సు సాంకేతిక రంగాలలో ప్రపంచం దూసుకుపోతుందని, ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కాలం ఆసన్నమైంది కానీ, మనుషుల్లో మార్పు రాలేదన్నారు. ఒక మెకానికల్ ఇంజనీర్ తన కారుకి చిన్న నట్టు పోతే వేసుకోలేని పరిస్థితి వచ్చింది అన్నారు. ఎలక్ట్రికల్ లో ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకున్నవారు తన ఇంట్లో ఫీజు పోతే వేసుకోలేని పరిస్థితి ఉందని, దాన్నిబట్టి మనం చదివే చదువుల వల్ల ఉపయోగం ఏంటో అర్థం చేసుకోవాలని కోరారు. చదువులతో పాటు సమాజాన్ని చదవాలని అభివృద్ధి చెందుతున్న సైన్స్ ని అందిపుచ్చుకోవాలని అప్పుడు మాత్రమే మన జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని ఆయన తెలిపారు అనంతరం ప్రకృతి ఆశ్రమం సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్ జయరాజుకు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్_ శోభారాణి దంపతులకు, అవయవ దానం పై అవగాహన కల్పిస్తున్న అమ్మ నేత్ర శరీర అవయవదాన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఈశ్వర్ లింగం లను ఆశ్రమ సభ్యులు ఘనంగా సన్మానించి, సత్కరించారు. కన్వీనర్ సుగుణా రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు కేహెచ్ ప్రసాద్ మాట్లాడుతూ విజ్ఞాన యాత్ర చేపట్టడం శుభదాయకమన్నారు.యాత్రకు కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని జాతీయ నాయకురాలు శోభారాణి, రాష్ట్ర కార్యదర్శి మెహర్ అలీ, ప్రకృతి ఆశ్రమం సభ్యులు శనగ వెంకటేశ్వర్లు, మల్లెల రామనాథం, మొక్కల రాజశేఖర్, ఎల్దండి పూర్ణచంద్రరావు, దయానంద సాగర్, బంగారి శంకర్, బిక్కులాల్, నంది శశి కుమార్, శోభారాణి, రఘు లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ