తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా వ్యాప్తంగా తుపాను ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశం ఉండటంతో అటువంటి ప్రాంతాల్లో నివసించే వారు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారులు, వంతెనలు, చెరువులు, వాగులు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, పిల్లలు, వృద్ధులు అవసరమైతే బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని సూచించారు. విద్యుత్ తీగలు తెగిపోయిన చోట్ల, చెట్లు కూలిన ప్రదేశాల్లో ప్రజలు చేరరాదని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో విస్తారంగా సాగు చేసిన వరి పంట కోతలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైతులు రాబోయే రెండు మూడు రోజులపాటు కోతలను వాయిదా వేసుకోవాలని ఆయన తెలిపారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఎత్తయిన ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. కోసిన పంటపై టార్పాలిన్ లేదా ఇతర కవర్లతో కప్పి వర్షపు నీరు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పంటను నష్టపోకుండా రైతులు ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. పంట నిల్వ కేంద్రాల వద్ద నీరు చేరకుండా మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలలో అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ