తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గిరిజన యువతకు ఫర్నిచర్ తయారీ రంగంలో వృత్తి శిక్షణతో ఉపాధి అవకాశాలు : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ను స్ఫూర్తిగా తీసుకొని దేశ సమగ్రత, అభివృద్ధి దిశగా యువత కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో “సర్దార్ @150 ఐక్యత పాదయాత్ర” కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని, కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మై భారత్ సంస్థ సమన్వయంతో దేశవ్యాప్తంగా సర్దార్ @150 ఐక్యత మార్చ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య విలువలు, దేశభక్తి భావనలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థులలో ఐక్యతా స్ఫూర్తి పెంపొందించేందుకు వ్యాసరచన, వాదవివాదాలు, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారని కలెక్టర్ వెల్లడించారు. దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించి, జాతీయ నాయకుల త్యాగాలకు ఘన నివాళి అర్పించడం ప్రధాన ఉద్దేశమని అన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యతా భావనలను పెంపొందించేందుకు ఈ దేశవ్యాప్త ఐక్యత పాదయాత్రలకు రూపకల్పన చేయబడిందని తెలిపారు. జిల్లా స్థాయిలో నవంబర్ 1 నుండి 15 వరకు మూడు రోజుల పాటు ఐక్యత పాదయాత్రలు, ఆరోగ్య శిబిరాలు, సర్దార్ వల్లభభాయ్ పటేల్ జీవితం పై ప్రసంగాలు, “ఆత్మనిర్భర్ భారత్” ప్రతిజ్ఞలు, సర్టిఫికేట్ ప్రదానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలచిన యువత https://mybharat.gov.in/pages/unity_march వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా, నషాముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా యువత మత్తు పదార్థాల వ్యతిరేకంగా ముందుండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాలో ఇప్పటికే విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. అనంతరం కలెక్టర్ జిల్లాలో విద్యార్థులు మరియు యువకులను ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ.. విద్యార్థుల్లో పర్యావరణ అవగాహన పెంపొందించేందుకు జిల్లాలో “విత్తన సేకరణ కార్యక్రమం” చేపట్టినట్లు తెలిపారు. అశ్వాపురం ఎంపీపీ పాఠశాల విద్యార్థులు 40 రకాలుగా 400 కిలోల విత్తనాలను సేకరించడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని పాఠశాలల్లో చేపట్టి, పర్యావరణ సంరక్షణకు విద్యార్థులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. మారుమూల గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు హైదరాబాద్లోని ఎన్ఎస్టీ సంస్థ ద్వారా ఫర్నిచర్ తయారీ రంగంలో మూడు నెలల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఎనిమిది మంది యువకులు ప్రస్తుతం రూ.15 వేల వేతనంతో ఆరు నెలల అప్రెంటిస్షిప్ పొందుతున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 30 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6వ తేదీ నుండి రెండవ విడత శిక్షణ కార్యక్రమానికి అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు , శిక్షణ సమయంలో వసతి, భోజనం, రిజిస్ట్రేషన్ సౌకర్యాలు ప్రైవేటు సంస్థల సహకారంతో ఉచితంగా కల్పించబడతాయని తెలిపారు. మొదటి విడతలో గిరిజన యువకులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు, రెండవ విడతలో కూడా వారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, ఇతర అర్హులైన యువత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వారికి కూడా విడతల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా యువత వృత్తి నైపుణ్యంతో స్వయం ఆధారంగా నిలబడి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అలాగే, జిల్లా ప్రజల ఆర్థిక అభివృద్ధికి చేపల పెంపకం, కౌజు పిట్టల పెంపకం వంటి యూనిట్లు ఫలితవంతంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి యూనిట్లను మరింత మంది స్థాపించి ఆర్థికంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. అనంతరం ఐక్యత ర్యాలీ కి సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అన్వేష్ చింతల డిప్యూటీ డైరెక్టర్, మేరా యువభారత్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, జిల్లా క్రీడా శాఖ అధికారి పందమరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ