తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం కింద చేపడుతున్న మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాదు నుండి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ మ్యాపింగ్ 95 శాతానికి పైగా పూర్తయిందని, తెలంగాణలో కూడా అదే స్థాయిలో పురోగతిసాధించేందుకు.సమన్వయంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వోలు తమ పరిధిలోని బూత్ లెవెల్ అధికారులు (బిఎల్ఓలు), సూపర్వైజర్లకు స్పష్టమైన దిశానిర్దేశం అందిస్తూ క్షేత్రస్థాయిలో పనులను క్రమబద్ధంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ఏజెంట్ల నియామకంపై ఇప్పటికే ఆయా పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించినందున, వారి సహకారాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ పరిధిలోని బిఎల్ఓలతో సమన్వయం పెంచుకుని మ్యాపింగ్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించేందుకు ముందుకు రావడం ద్వారా మిగిలిన ప్రాంతాల్లో పనులను వేగంగా పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ ప్రక్రియలో ఖచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ను ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, ఇతర జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని పాల్వంచ, కొత్తగూడెం పట్టణాల్లో మ్యాపింగ్ పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. బిఎల్ఓలు, సూపర్వైజర్ల సమన్వయంతో మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి, వారం రోజుల్లో గణనీయమైన పురోగతి సాధించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతిరోజూ పురోగతిని సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందజేస్తామని తెలిపారు . ఈ సమావేశంలో కొత్తగూడెం ఆర్టిఓ మధు, ఎన్నికల సూపర్డెంట్ రంగ ప్రసాద్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ