తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్ర నూనె గింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో అశ్వరావుపేట మండలం నారావారిగూడెం గ్రామంలో ఆదునిక పద్ధతిలో ఆయిల్పామ్ విత్తన నాటింపు మరియు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార మరియు చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు ముఖ్యఅతిథిగా, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, సత్తుపల్లి శాసనసభ్యులు మట్టా రాగామయి తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు మాట్లాడుతూ, ఆయిల్పామ్ పంటను వాతావరణానికి అనుగుణంగా, ధృవీకరించబడిన హైబ్రిడ్ విత్తనాల ద్వారా, సమయానికి తగిన సాంకేతిక పద్ధతులు, మందుల వినియోగం పాటిస్తూ సాగించడం ద్వారా పంట నష్టాలను తగ్గించవచ్చని, రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించవచ్చని తెలిపారు. నాణ్యతలేని తల్లి మొక్కలను నర్సరీ నుంచి బయటకు తీసుకురావద్దు, విత్తన నాణ్యతను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, అలాగే, ఆయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, స్థానిక మరియు ప్రైవేట్ పరిశ్రమల ద్వారా పంటను సమగ్ర మార్కెట్కు కనెక్ట్ చేసి, బై-ప్రొడక్ట్స్ వాడకం ద్వారా అదనపు ఆదాయాన్ని రైతులకు అందించడం ముఖ్యమని అన్నారు.గతంలో పంటలు నష్టపోవడం, మార్కెటింగ్ సమస్యలు ఎదుర్కోవడం వంటి సమస్యలు ఎదురైనప్పటికీ, శాస్త్రీయ పద్ధతులు, నర్సరీ నియంత్రణలు, సాంకేతిక శిక్షణ ద్వారా సమస్యలను అధిగమించవచ్చని. రాష్ట్రవ్యాప్తంగా 10–20 లక్షల ఎకరాలకు ఆయిల్పామ్ పంట విస్తరించవచ్చని, ప్రైవేట్ మరియు ప్రభుత్వ ఫ్యాక్టరీల కలయిక ద్వారా మార్కెటింగ్, ప్రాసెసింగ్ సదుపాయాలను సమకూర్చి, రైతులకు స్థిరమైన ధరలు మరియు ఆదాయం అందించగలమని ఆయన తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆయిల్పామ్ ఉత్పత్తిలో అగ్ర స్థానం సంపాదించాలి మరియు రైతులు ఆధునిక పద్ధతుల్లో సాగించిన పంట ద్వారా అధిక లాభాలను పొందగలిగేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఆయిల్పామ్ పంట సంరక్షణ, నర్సరీ నుండి సరైన విత్తన సరఫరా, సాంకేతిక శిక్షణ, మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ వ్యవస్థలను సమకూర్చడం ద్వారా రైతుల స్థిరమైన మరియు లాభదాయకమైన వ్యవసాయ జీవితం సాధ్యమవుతుందని మంత్రి ప్రత్యేకంగా చెప్పారు.అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ మాట్లాడుతూ.. రైతుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసే ఆయిల్ పామ్ సాగు కార్యక్రమం అని అన్నారు ఈ శుభవేళలో మనం నాటే ప్రతి విత్తనం కేవలం మొక్క కాదు — అది రైతు గుండెల్లో ఉజ్వల భవిష్యత్తుకు బాట వేస్తున్న ఆశాకిరణం అని ఆశ భావం వ్యక్తం చేశారు. మన రైతులు ఈరోజు నాటుతున్న విత్తనాలు రేపటి పామాయిల్ తోటలకు పునాది అన్నారు. ఈ విత్తనాలు పండ్లను మాత్రమే ఇవ్వవు, ఉపాధి, ఆదాయం, ఆత్మవిశ్వాసం కూడా అందిస్తాయి అన్నారు. మన జిల్లాలోనే వ్యవసాయ ఉత్పత్తికి కేంద్రంగా ఉన్న ఆధునిక ఆయిల్ పామ్ నర్సరీ, రైతులకు ఆర్థిక స్థిరత్వం కల్పించే దిశగా మరో కీలక అడుగు వేసిందన్నారు .ఈ ఆయిల్ ఫామ్ ద్వారా వచ్చే రోజుల్లో సుమారు 5,000 నుండి 10,000 మంది వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేవలం సాధారణ రైతులు మాత్రమే కాకుండా, గిరిజన రైతులు కూడా ఇప్పుడు నర్సరీలు ఏర్పాటు చేసుకునే సామర్థ్యాన్ని పొందుతున్నారు. ఇది నిజంగా మన ప్రాంతం అభివృద్ధికి కొత్త అధ్యాయం అన్నారు.హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాల్లో ఈ ప్రగతిని మరింత విస్తరించే లక్ష్యంతో మంత్రివర్యులు, అధికారులు సమన్వయంతో కృషి చేస్తున్నారు అని,మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ప్రయత్నాలతో రాష్ట్రంలోనే ఒక మోడల్ జిల్లాగా నిలవనుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ చందా రాఘవరెడ్డి, ఆయిల్ ఫెడ్ ఎండి శంకరయ్య, నాచారం పిఎసిఎస్ అధ్యక్షుడు ఎర్ర రాఘవరావు, ఆయిల్ పెట్ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్, ఆయిల్ పెడ్ జిఎం సుధాకర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవెల్లి వీరభద్రరావు, ఆయిల్ ఫెడ్ ఓ ఎస్ డి అడపా కిరణ్ కుమార్, వ్యవసాయ కళాశాల డీన్ హేమంత్ మరియు రైతులు వ్యవసాయ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ