తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అంగన్వాడీలకు ‘ఎన్నికల విధుల’ సెగ! అంగన్వాడీలపై 'బీఎల్ఓ' భారం.. మూతపడే దిశగా కేంద్రాలు! - కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన ఏఐటీయూసీ (AITUC) నాయకులు జిల్లాలోని అంగన్వాడీ టీచర్లకు అదనంగా కేటాయించిన బీఎల్ఓ (బూత్ లెవల్ ఆఫీసర్) విధులను తక్షణమే రద్దు చేయాలని ఏఐటీయూసీ (AITUC) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో అధికారులను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించారు . సహాయకులు లేక సతమతం.. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, జిల్లాలోని దాదాపు 50 శాతానికి పైగా అంగన్వాడీ కేంద్రాలలో గత కొన్నేళ్లుగా హెల్పర్లు (సహాయకులు) లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల టీచర్లే అటు బోధనతో పాటు ఇటు కేంద్రాల నిర్వహణ పనులను కూడా ఒంటరిగా చూసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి అదనంగా ఓటర్ల జాబితా సవరణ వంటి బీఎల్ఓ విధులను అప్పగించడం వల్ల అంగన్వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు.పౌష్టికాహారం, ముందస్తు విద్యకు ఆటంకం టీచర్లు ఎన్నికల విధుల్లో నిమగ్నం కావడం వల్ల కేంద్రాలకు వచ్చే గర్భిణులు, బాలింతలు మరియు చిన్న పిల్లలకు అందాల్సిన పౌష్టికాహార పంపిణీతో పాటు, ప్రీ-స్కూల్ బోధన పూర్తిగా కుంటుపడుతోందని వారు తెలిపారు. ప్రభుత్వంలో పంచాయతీరాజ్, ఉపాధి హామీ , విద్యా శాఖ వంటి ఇతర శాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ, కేవలం అంగన్వాడీ టీచర్లపైనే ఈ భారాన్ని నెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. కనీస సౌకర్యాలు లేవు.. బీఎల్ఓ విధులకు సంబంధించి ఎలాంటి అలవెన్సులు (TA, DA) ఇవ్వకపోగా, ఆన్లైన్ పనుల కొరకు కనీసం ట్యాబ్లు లేదా మొబైల్ ఫోన్లు కూడా సమకూర్చలేదని మండిపడ్డారు. కావున, ఉన్నతాధికారులు మరియు ఎన్నికల సంఘం తక్షణమే స్పందించి అంగన్వాడీ టీచర్లను బీఎల్ఓ విధుల నుండి మినహాయించాలని, లేనిపక్షంలో మాతా శిశు సంరక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ