తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వేసవిలో త్రాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లో పూర్తి సదుపాయాలు కల్పించాలి. 99 రోజుల కార్యాచరణలో భాగంగా ‘సే నో టు డ్రగ్స్’ కార్యక్రమాలు విజయవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్ అంకిత్. జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు, త్రాగునీటి సమస్యలపై వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్టతో కలిసి శుక్రవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వివరాలు, కొనుగోలు ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలపై అధికారుల నుండి వివరణ తీసుకున్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, షెడ్లు, తూకం యంత్రాలు, రవాణా సదుపాయాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియలో ఆటంకాలు రాకుండా చూడాలని సూచించారు.వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడైనా నీటి సరఫరాలో అంతరాయం కలిగితే తక్షణమే పరిష్కారం చూపడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నిరంతరంగా తాగునీరు అందేలా చూడాలని సూచించారు. టేకులపల్లి ప్రాంతంలో త్రాగునీటి సమస్య తమ దృష్టికి వచ్చిందని, వెంటనే సమస్యను పరిష్కరించి సరఫరా పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కింద సోమవారం నుండి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చైల్డ్ సేఫ్టీ, ప్రొటెక్షన్, “సే నో టు డ్రగ్స్” కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామ, వార్డు స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయాలని, యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు, గర్భిణీలు, చిన్నారుల కోసం ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, సీజనల్ వ్యాధుల నివారణకు ఫాగింగ్, పరిసరాల పరిశుభ్రత పనులు చేపట్టడం, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించడం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా, పంచాయతీ అధికారి సుధీర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ