తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధి, వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా చేరవేసే బాధ్యతను సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు స్వీకరించి, యువతలోచైతన్యం కలిగించే విధంగా భాగస్వాములుగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు.శనివారం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా పర్యాటక రంగ అభివృద్ధి, ముక్కోటి సందర్భంగా నిర్వహించనున్న ఏరు రివర్ ఫెస్టివల్ను విజయవంతం చేయడానికి చేపట్టవలసిన చర్యలపై ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మికత, గిరిజన సంస్కృతి సమ్మేళనంగా ఉన్న జిల్లాగా గుర్తింపు పొందిందని అన్నారు. జిల్లాలోని పగిడేరు వేడి నీళ్లు, గోదావరి నది పరివాహక ప్రాంతాలు, కనిగిరి గుట్టలు, కిన్నెరసాని అడవీ ప్రాంతాలు వంటి అనేక విశిష్టమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో పర్యాటక పటంలో స్థిరపరచడానికి విస్తృత స్థాయి ప్రచారం అత్యవసరమని అన్నారు.పర్యాటక రంగ అభివృద్ధి ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు బలాన్ని చేకూర్చవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పర్యాటకుల రాక పెరిగితే హోటళ్లు, రవాణా, హస్తకళలు, స్థానిక వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. జిల్లాలో పర్యాటక ప్రాంతాలను ఎకో టూరిజం హబ్లుగా అభివృద్ధి చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని వివరించారు.పర్యాటక రంగంలో సోషల్ మీడియా పాత్ర కీలకమని కలెక్టర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను వీడియోలు, ఫోటోలు, కథనాల రూపంలో డిజిటల్ వేదికల ద్వారా ప్రజలకు చేరవేస్తే జిల్లాకు విశేష గుర్తింపు లభిస్తుందని అన్నారు. యువతను లక్ష్యంగా చేసుకుని సానుకూల సందేశాలతో జిల్లాను ప్రమోట్ చేయాలని సూచించారు.ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఏరు రివర్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా,22వ తేదీన బెండలపాడు లోని కనిగిరి గుట్టల ట్రెక్కింగ్,23వ తేదీన కిన్నెరసాని రివర్ వాక్ ముత్తాపురం నుండి మొతలగూడెం బ్రిడ్జి వరకు సుమారు మూడున్నర కిలోమీటర్ల వాకింగ్ కార్యక్రమం,24వ తేదీన పాల్వంచలోని శ్రీనివాస్ గిరి గుట్ట ట్రెక్కింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 26వ తేదీన దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో సాయంత్రం 4.30 గంటలకు ట్రైబల్ ఈవినింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంప్రదాయ నృత్యాలు, సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.27వ తేదీన భద్రాచలం గోదావరి నది ఒడ్డున సాంస్కృతిక కార్యక్రమాలు, ఆసక్తి గల యువత ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు అని తెలిపారు.28వ తేదీన గోదావరి నది ఒడ్డున సంప్రదాయ సాంస్కృతిక కార్యక్రమాలు,29వ తేదీన పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు,30వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. పర్యాటకుల సౌకర్యార్థం గోదావరి నది ఒడ్డున క్యాంపులు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాలన్నింటిలో ఆసక్తి గల యువత, పర్యాటకులు చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు జిల్లాలో జరుగుతున్న పర్యాటక, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారంలో భాగస్వాములై, విస్తృత స్థాయిలో ప్రజలకు చేరవేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. యువతను చైతన్యపరచే విధంగా సానుకూల దృక్పథంతో కార్యక్రమాలను ప్రచారం చేయాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ