తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో సోమవారం శ్రీ బసవేశ్వరుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలిసి బసవేశ్వరుడి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బసవేశ్వరుడు జీవితం భావితరాలకు ఆదర్శప్రాయమని అన్నారు . సమాజంలో వర్ణ వివక్ష నిర్మూలనకు, దళిత, బహుజన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి విశిష్టమని తెలిపారు. సమానత్వం, న్యాయం, శ్రమకు గౌరవం వంటి విలువలను బసవేశ్వరులు బోధించినట్లు చెప్పారు. బసవేశ్వరుడు చిన్న వయస్సులోనే శైవ సాంప్రదాయాలపై అవగాహన సాధించి కర్మకాండాలపై అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఉపనయనం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించి కూడల సంగమానికి చేరి సంగమేశ్వరుని భక్తితో ఆరాధించినట్లు పేర్కొన్నారు. ఆయన స్థాపించిన “అనుభవ మండపం” అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను వ్యక్తపరచుకునే వేదికగా నిలిచిందన్నారు. మనుషులందరూ ఒక్కటే”, “దేహమే దేవాలయం”, “స్త్రీ-పురుష భేదం లేదు”, “శ్రమకు మించిన సౌందర్యం లేదు” అనే బసవేశ్వరుల సందేశాలు నేటి సమాజానికి మార్గదర్శకమని తెలిపారు. యువత ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారివిజయలక్ష్మీ, ఎ.డి. మైన్స్ జి. దినేష్, ఎస్.సి. కార్పొరేషన్ ఈ.డి. ఉపేందర్, యువజన శాఖ పరందామ రెడ్డి, గుమలాపురం సత్యనారాయణ, ముదురుకోళ్ళ కిషోర్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ