తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం అశ్వాపురం మండలం పరిధిలోని మిట్టగూడెం లో DCMS ద్వారా ఏర్పాటైన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం కొత్వాల సందర్శించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు ప్రభుత్వం మద్దతు ధరతో పాటు క్వింటాలుకు 500 రూపాయలు ప్రభుత్వ బోనస్ కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు.
రైతుల సంక్షేమానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని కొత్వాల అన్నారు. రైతు శ్రేయస్సే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని అన్నారు. ఒకే దఫా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిందన్నారు. రైతులకు ధాన్యం క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నదని, త్వరలోనే రైతు భరోసా పథకం చేపట్టనున్నదని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం ఇంచార్జి, స్థానిక రైతులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ