తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ, వానాకాలం (ఖరీఫ్) సీజన్-2026 ప్రారంభమై రోజులు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికీ స్పష్టమైన వ్యవసాయ ప్రణాళిక లేదని విమర్శించారు. విత్తనాల విత్తకం నుండి పంటల కొనుగోలు పూర్తయ్యే వరకు ప్రభుత్వం అనుసరించబోయే విధానంపై రైతులకు స్పష్టత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏ జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏ పంటలు సాగు చేయాలి, ఎరువుల లభ్యత ఎంత మేరకు ఉంటుంది, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎలా ఉంటుందనే అంశాలపై ముందస్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయాలు పెరిగిపోతున్నాయని, ముఖ్యంగా పత్తి, మిర్చి, వరి విత్తనాల పేరుతో కొందరు ప్రైవేట్ డీలర్లు రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి దిగుబడులు రాక అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొని రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడి ఇచ్చే విత్తనాలను సబ్సిడీపై అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రబీ సీజన్కు సంబంధించిన పెండింగ్ రైతు భరోసా నిధులు మరియు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ రైతు భరోసా నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులందరికీ రూ.2 లక్షల వరకు సంపూర్ణ రుణమాఫీ అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఎరువుల పంపిణీని యాప్ ఆధారంగా కాకుండా నేరుగా రైతులకు అందించే విధానం చేపట్టాలని, యూరియా మరియు ఇతర ఎరువుల కొరత లేకుండా చూడాలని సూచించారు. పంటల బీమా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు మరియు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీష్, గొట్టిపూళ్ల దుర్గా శ్రీనివాసు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రవీందర్, సముద్రాల గాయత్రి, పాల్వంచ టౌన్ అధ్యక్షులు రాపాక రమేష్, బలగం శ్రీధర్, నవీన్, తెల్లం నరసింహారావు, నిమ్మటూరి రామారావు, బానోత్ కుమార్, గడ్డం అజయ్ కుమార్, భూక్య మోహన్ తదితర బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ