తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం- ఆగస్టు 15. (తెలుగు వెలుగు) భారత స్వాతంత్ర పోరాటంలో వీరుల పోరాట సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. పంద్రాగస్టు సందర్భంగా కొత్తగూడెంలోని అనేక ప్రాంతాల్లో జరిగిన జెండావిష్కరణ వేడుకల్లో మాజీ జెడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ప్రయాణం అపారమైన త్యాగం, ధైర్యం, ఐక్యతతో నిండిన మార్గంలో సాగిందన్నారు. 1857లో మొదలైన సిపాయిల తిరుగుబాటు నుంచి క్విట్ ఇండియా ఉద్యమం వరకు స్వాతంత్ర్య సమరయోధులు, భారతీయ ప్రజలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని, అయినా సరే వారు వెనక్కి తగ్గకుండా పరాయి పాలన నుండి తమను తాము రక్షించుకోవడానికి ఈ దేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి వారు ఎన్నో కష్టాలు పడ్డారని మరెన్నో త్యాగాలు చేశారన్నారు. మన స్వాతంత్ర్య కోసం పోరాడిన ఎంతోమంది ధైర్యవంతుల కారణంగానే మనం ఈనాడు స్వేచ్ఛగా ఉన్నామని భగత్ సింగ్, రాణీ లక్ష్మీబాయి, సుభాష్ చంద్రబోస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది వీరులు తమ జీవితాలను మన దేశ స్వాతంత్ర్య కోసం అంకితం చేశారని వారి సంకల్పమే మనకు స్ఫూర్తిని ఇస్తుందన్నారు. మన దేశం విభిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాల కలిసిన భూమి. అయినప్పటికీ మనం ఒకే దేశంగా ఐక్యంగా ఉన్నామని, మన ఐక్యతే మనకు బలమని, సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడానికి ఈ ఐక్యతను ఇలానే కాపాడుకుందామని, మహాత్మా గాంధీ మనకు అహింసా, సత్యానికి ఉన్న శక్తిని బోధించారు. కాబట్టి అహింసా, సత్యాన్ని వీడకుండా శాంతియుత సమాజాన్ని స్థాపించేందుకు మన వంతు పాత్రను నిర్వర్తించాల్సిన అవసరం కూడా ఉందనీ అయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ళ మురళి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా,మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ