తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ – అ లైవ్” కార్యక్రమంలో భాగంగా బుధవారం పాత కొత్తగూడెం హనుమాన్ బస్తీ లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ అంకిత్ ఘనంగా ప్రారంభించారు. “రహదారుల భద్రత మన అందరి బాధ్యత” అనే నినాదంతో ప్రారంభమైన ఈ ర్యాలీలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రోడ్డు భద్రతపై నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రహదారుల భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించడం అత్యంత కీలకమని అన్నారు . చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన పెంపొందితే భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, బంధువులు, ఉపాధ్యాయులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్లలో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ ధరించాలనే విషయాన్ని గుర్తుచేయాలని సూచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్, జీబ్రా క్రాసింగ్ వినియోగం, రోడ్డు నియమాల పాటింపు వంటి అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పాఠశాలల్లో రోడ్డు భద్రతపై పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక అవగాహనా తరగతులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ర్యాలీలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో భద్రతపై చైతన్యం పెంపొందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఈ ప్రమాదాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. “అరైవ్ – అ లైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించడం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏం ఈ ఓ మధురవాణి, ప్రధానోపాధ్యాయులు లక్ష్మి, కోఆర్డినేటర్ నాగశేఖరా శర్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు, పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ