తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో నిర్వహించనున్న నీట్ (యూజీ)-2026 ప్రవేశ పరీక్షను ఎలాంటి లోపాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కచ్చితంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మే 3వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో మొత్తం 1078 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఇందుకోసం మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సింగరేణి ఉమెన్స్ కళాశాల, శ్రీ రామచంద్ర డిగ్రీ కళాశాల, నవభారత్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి ఎదురుగా గల తెలంగాణ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు . అభ్యర్థులను ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. బయోమెట్రిక్ హాజరు, రిజిస్ట్రేషన్, భద్రతా తనిఖీల దృష్ట్యా అభ్యర్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు పైన తప్పనిసరిగా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించుకోవాలని, అదనంగా మరో ఫోటోతో పాటు తాజా ఫోటో ఉన్న గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, పర్సులు, వాచీలు, బెల్ట్లు, చైన్లు, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, రింగులు వంటి వస్తువులు అనుమతించబడవని స్పష్టం చేశారు. అభ్యర్థులు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కోరారు. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163(బి) అమలు చేయాలని, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని, ప్రశ్నాపత్రాల రవాణా మరియు పరీక్ష అనంతరం జవాబు పత్రాల భద్రత కోసం పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులు సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. పరీక్షా రోజున విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతర సరఫరా కల్పించేందుకు విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఈ పరీక్ష విద్యార్థుల భవిష్యత్తుకు కీలకమైనదని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ, పాల్వంచ సీఐ సతీష్, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, కలెక్టరేట్ సూపర్డెంట్ వెంకటేశ్వర్లు, నీట్ పరీక్ష ఇంచార్జ్ ప్రసాద్, పరీక్షా కేంద్రాల సూపర్డెంట్లు, తాసిల్దారులు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, విద్యుత్ శాఖ అధికారులు,సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ