తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్ సుజాతనగర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, కొనుగోలు ప్రక్రియపై సమగ్రంగా ఆరా తీశారు. మొదటగా సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమగ్రంగా పరిశీలించారు. ఔట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ విభాగం, మందుల గది, సిబ్బంది హాజరు నమోదు పత్రాలు, ఔట్ పేషెంట్ రిజిస్టర్ను పరిశీలించి రోజువారీగా నమోదవుతున్న కేసుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రక్తపరీక్షలు, ఇతర నిర్ధారణ పరీక్షల నిర్వహణ, ల్యాబ్ సేవల పరిస్థితి, పరీక్షల ఫలితాలను రోగులకు సమయానికి అందిస్తున్న విధానంపై ఆరా తీశారు. మందుల నిల్వ గదిని పరిశీలించి అందుబాటులో ఉన్న మందుల స్టాక్, అవసరమైన మందుల లభ్యత, రికార్డుల నిర్వహణను తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వార్డులు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోగులకు పరిశుభ్రమైన వాతావరణంలో మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, రోగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని తెలిపారు. అనంతరం సుజాతనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ, నిల్వలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రవాణా ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం, మొక్కజొన్న నిల్వల వివరాలను పరిశీలించి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలపై ఆరా తీశారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, రైతులు రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని సూచించారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మొక్కజొన్న తరలింపునకు తగినన్ని లారీలు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. లోడింగ్, రవాణా సమస్యల కారణంగా మొక్కజొన్న కేంద్రంలోనే నిల్వ ఉండిపోతుందని వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే తగినన్ని లారీలు ఏర్పాటు చేసి రవాణా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పి.ఆర్-126 రకం ధాన్యంలో “పిన్ పాయింట్ డ్యామేజ్” ఉన్నదనే కారణంతో రైస్ మిల్లర్లు ధాన్యాన్ని స్వీకరించడం లేదని రైతులు వివరించగా, దీనిపై రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. రైతుల ధాన్యం ఎక్కడా నిల్వ ఉండకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎంతో శ్రమించి పండించిన ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైనన్ని గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, తాగునీరు, తేమ కొలిచే పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారులు నిరంతరం అందుబాటులో ఉండి రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ధాన్యం రవాణా, నిల్వ, లోడింగ్ తదితర అంశాలలో సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ కృష్ణ ప్రసాద్, ఎంపీడీవో భారతి, వైద్య అధికారులు డాక్టర్ రమేష్ కొనుగోలు కేంద్రం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ