తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ 26వ డివిజన్ సిపిఐ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎర్రా లింగేష్ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం 26వ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సిట్టింగ్ స్థానమైన 26వ డివిజన్లో మళ్లీ సిపిఐ అభ్యర్థిని గెలిపించి, డివిజన్ అభివృద్ధికి ఓటర్లు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి వార్డుల్లో మంచినీళ్ల కులాయిలను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో కార్పొరేషన్ ను అభివృద్ధి చేసుకోవాలంటే సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం నియోజకవర్గ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి రెండు నూతన బొగ్గు బావులను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాల్వంచలో కేటీపీఎస్ విస్తీర్ణంలో భాగంగా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించామని తెలిపారు. ఓటర్లు కల్లబొల్లికబుర్లకు, తప్పుడు వాగ్దానాలను నమ్మకుండా పోరాటాల పార్టీ అయినా సిపిఐ అభ్యర్థులకు మద్దతుగా నిలబడాలని అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ