తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించనున్న “అరైవ్ – అ లైవ్” కార్యక్రమాల గోడపత్రికను జిల్లా కలెక్టర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడం అత్యవసరమని తెలిపారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో మానవ తప్పిదాలే ప్రధాన కారణమవుతున్నాయని పేర్కొంటూ, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. “అరైవ్ – అ లైవ్” కార్యక్రమాల ద్వారా ప్రజల్లో బాధ్యతాయుతమైన డ్రైవింగ్ అలవాట్లు పెంపొందించడం, ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం లక్ష్యమని వివరించారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, అధిక వేగంతో వాహనాలు నడపకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకుండా ఉండడం వంటి భద్రతా చర్యలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. యువత ముఖ్యంగా ట్రాఫిక్ నియమాలను గౌరవిస్తూ, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాల భాగంగాగ్రామసభలు,అవగాహన ర్యాలీలు, పాఠశాలలు మరియు కళాశాలల్లో ప్రత్యేక చైతన్య కార్యక్రమాలు, డ్రైవర్లకు శిక్షణ శిబిరాలు, ప్రజలకు అవగాహన కల్పించే వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ , సిబ్బంది మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ