తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రజలు నిత్యం సైబర్, రహదారి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి – ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి రహదారుల ప్రమాదాల నివారణకు అవగాహన కీలకం – కలెక్టర్ అంకిత్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రహదారుల భద్రత వారోత్సవాలలో “అర్రైవ్ అ లైవ్” కార్యక్రమం కింద శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మరియు జిల్లాలో చోటుచేసుకున్న రహదారి ప్రమాదాలు, వాటి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. గుడ్ సమారిటన్ విధానం, త్వరలో అమలులోకి రానున్న పీఎం అర్హత్ పథకం గురించి కూడా వివరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు నిత్యం సైబర్ మోసాలు మరియు రహదారి ప్రమాదాలపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంట్లో ఉన్నప్పుడు సైబర్ మోసాలపై, బయటకు వెళ్లినప్పుడు రహదారి ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సైబర్ మోసాల్లో డబ్బులు కోల్పోతే తిరిగి సంపాదించుకోవచ్చుగానీ, రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని అన్నారు. గత ఏడాది జిల్లాలో 248 మంది రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ ఉపయోగించకపోవడం వంటి కారణాలు ప్రమాదాలకు ప్రధాన కారణాలని చెప్పారు. గ్రామస్థాయిలో గ్రామసభల ద్వారా రహదారి భద్రతపై తీర్మానాలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, వాహన తనిఖీలు వంటి చర్యలు చేపడుతోందని తెలిపారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా రహదారి భద్రతను పాటించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రమాదాలను తగ్గించే దిశగా కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ “రహదారి ప్రమాదాల నివారణకు అవగాహన అత్యంత ముఖ్యమైనది. ‘అర్రైవ్ అ లైవ్’ కార్యక్రమం ద్వారా జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులు, యువత ముందుకు వచ్చి సమాజంలో రహదారి భద్రతపై చైతన్యం కల్పించాలి. జిల్లాలో కేటీపీఎస్, బీటీపీఎస్, సింగరేణి వంటి పరిశ్రమల కారణంగా భారీ వాహనాల రాకపోకలు అధికంగా ఉండటంతో ప్రమాదాల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే 38 బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ ప్రత్యేక చర్యలు చేపడుతున్నాము. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులకు తక్షణ వైద్యసహాయం అందేలా అంబులెన్స్ సేవలను బలోపేతం చేస్తున్నాము. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ట్రాఫిక్ నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేస్తున్నాము. ప్రజలు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, వేగ పరిమితులు పాటించడం వంటి అంశాలను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. రహదారి భద్రతను ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా తమ బాధ్యతగా భావించి సహకరించాలి.” జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణలో పోలీస్ శాఖతో పాటు మున్సిపల్, వైద్య, రవాణా తదితర శాఖల సమన్వయం కీలకమని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 500 మందికి పైగా రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం, సీట్ బెల్ట్ వినియోగించకపోవడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు తమ హక్కులతో పాటు బాధ్యతలను గుర్తించి రహదారి భద్రతకు సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం రహదారి భద్రతపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొంతమందికి డ్రైవింగ్ లైసెన్సులు అందించారు. పూసుకుంట గిరిజన కొండరెడ్డి సమాజానికి చెందిన వారికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పగడాల రమాదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్, పాల్వంచ డిఎస్పి సతీష్, తాసిల్దార్ రామ్ నరేష్ ఎంపీడీవో రవీందర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులు, పోలీస్ శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ