తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మాజీ డైరెక్టర్, డాక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో గడల శ్రీనివాసరావుకి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, డాక్టర్ గడల శ్రీనివాసరావు కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో కాలంగా సన్నిహిత అనుబంధం ఉందన్నారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, నిజాయతీ, పరిపాలనా దక్షత కలిగిన అధికారిగా డాక్టర్ గడల శ్రీనివాసరావు ప్రజల్లో విశేష గౌరవం సంపాదించుకున్నారని పేర్కొన్నారు.ప్రభుత్వ వైద్యుడిగా ప్రారంభమైన ఆయన సేవా ప్రస్థానం ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ స్థాయికి చేరుకోవడం ఆయన కృషి, నిబద్ధతకు నిదర్శనమన్నారు. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.డాక్టర్ గడల శ్రీనివాసరావు వంటి అనుభవజ్ఞులు, సేవాభావం కలిగిన వ్యక్తులు జనసేనలో చేరడం పార్టీకి మరింత బలాన్ని, విశ్వసనీయతను తీసుకువస్తుందని తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన, పరిపాలనా అనుభవం, సమాజంలోని వివిధ వర్గాలతో ఆయనకు ఉన్న అనుబంధం తెలంగాణలో పార్టీ విస్తరణకు దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.సమాజ సేవను లక్ష్యంగా పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తున్న డాక్టర్ గడల శ్రీనివాసరావును హృదయపూర్వకంగా జనసేన కుటుంబంలోకి ఆహ్వానిస్తూ, తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఆయన కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.అనంతరం డాక్టర్ గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తో తన అనుబంధం మెగాస్టార్ చిరంజీవి ద్వారా ప్రారంభమైందని తెలిపారు. కాలక్రమేణా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, నిజాయతీ, ప్రజా సమస్యల పట్ల ఆయనకున్న నిబద్ధత తనను ప్రభావితం చేశాయని పేర్కొన్నారు.తాను జనసేనలో చేరడం భావోద్వేగపూరిత నిర్ణయం కాదని, సమాజానికి మరింత విస్తృత స్థాయిలో సేవ చేయాలనే సంకల్పంతో తీసుకున్న ఆలోచిత నిర్ణయమని స్పష్టం చేశారు. యువతకు ఆశయాలను, దిశానిర్దేశాన్ని అందించే నాయకత్వం పవన్ కళ్యాణ్ లో కనిపించిందని అన్నారు.ప్రస్తుత తరానికి విలువలతో కూడిన రాజకీయాలు అవసరమని, ఆ లక్ష్యంతో పనిచేస్తున్న జనసేన పార్టీ తనకు సరైన వేదికగా భావించానని తెలిపారు. ఇకపై జనసైనికుడిగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాకుండా, తెలంగాణలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.ప్రజాసేవే తన జీవిత లక్ష్యమని, ప్రభుత్వ సేవలో ఉన్నప్పుడు ఎలా అంకితభావంతో పనిచేశానో, ఇకపై ప్రజా జీవితంలో కూడా అదే నిబద్ధత, చిత్తశుద్ధితో ముందుకు సాగుతానని డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగానికి చెందిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ప్రజారోగ్య కార్యకర్తలు, యువత, మహిళలు, మేధావులు మరియు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రభుత్వ సేవా కాలంలో అందించిన ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం, సహకారం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు.అలాగే కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో తనతో కలిసి పనిచేసిన మీడియా మిత్రులు, జర్నలిస్టులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టే తన భవిష్యత్ కార్యక్రమాలకు కూడా ఇదే సానుకూల సహకారం, ఆదరణ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ సమాజ అభ్యున్నతి, యువత సాధికారత, మహిళల పురోగతి, ప్రజారోగ్య పరిరక్షణ మరియు ప్రజా సంక్షేమమే తన రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యాలని, ప్రజల ఆశీస్సులు, సహకారం తనకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయని డాక్టర్ గడల శ్రీనివాసరావు పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ