తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన Arrive-alive అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “Arrive Alive” కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో వాహనదారులకు ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహించారు.ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో ఇల్లందులోని అయిత ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 మందికి పైగా స్థానికులు,ప్రముఖులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం,గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య పరిరక్షణపై కూడా దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు,ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని,కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు.చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు.ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాలలో అధిక శాతం,అతివేగం,మద్యం సేవించి వాహనం నడపడం,మొబైల్ ఫోన్ వినియోగం మరియు చూపు సమస్యలను నిర్లక్ష్యం చేయడం వలననే జరుగుతున్నాయని తెలిపారు.ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాలు నడిపే డ్రైవర్లు,సుదూర ప్రయాణాలు చేసే లారీ మరియు బస్సు డ్రైవర్లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.డ్రైవింగ్ సమయంలో స్పష్టమైన చూపు లేకపోతే,ట్రాఫిక్ సిగ్నల్స్,రోడ్ సైన్ బోర్డులు,ముందున్న వాహనాలు సరిగా కనిపించక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.అందువల్ల డ్రైవర్లు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా,సమయానుకూలంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యంత అవసరమని తెలిపారు.ఈ శిబిరంలో అనుభవజ్ఞులైన కంటి వైద్యులు ఆధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన డ్రైవర్లకు తగిన సూచనలు ఇచ్చి, చూపు సమస్యలు గుర్తించిన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందజేయడంతో పాటు అవసరమైన మందులు కూడా పంపిణీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ