తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖ పిడి రవీంద్రనాథ్ తో కలసి ప్రజల నుండి వచ్చిన వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ప్రతి వినతిపత్రాన్ని శ్రద్ధగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పరిష్కరించగల అంశాలను అక్కడికక్కడే పరిష్కరించాలని, మిగిలిన సమస్యలను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదులోని మూల కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు తమ వినతులను పూర్తి వివరాలతో, అవసరమైన ఆధార పత్రాలతో సమర్పిస్తే పరిష్కార ప్రక్రియ వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి ఫిర్యాదుకు సమర్థవంతమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. ప్రజావాణిలో వచ్చిన కొన్ని దరఖాస్తులు జూలూరుపాడు మండలం సూరారం గ్రామానికి చెందిన భూలక్ష్మి తన రేకుల ఇల్లు శిధిలావస్థలో ఉందని, పలుమార్లు ఇందిరమ్మ గృహం కోసం దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదని వినతి సమర్పించారు. దీనిపై రెండో విడతలో గృహం మంజూరు అంశాన్ని పరిశీలించాలని గృహ నిర్మాణ శాఖ పీడీకి ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని దుర్జనుబస్తీకి చెందిన నోముల వీరకుమారి తన భర్త గుండెపోటుతో మరణించడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని, జీవనోపాధి కల్పించాలని అభ్యర్థించారు. ఆమె వినతిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఉపాధి కల్పనాధికారికి ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన భూక్య చంద్రనాయక్ తనకు ఉన్న 18.12 ఎకరాల భూమిలో కొంతభాగాన్ని కుమారులకు బదిలీ చేయడానికి దరఖాస్తు చేసినప్పటికీ కే-ఫామ్ జారీ కాలేదని తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఓఎస్డీకి ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం సూదిమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని సుభాష్నగర్కు చెందిన వేమూరు వీరస్వామి తన ఇంటిని తన సోదరుడు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డీపీఓకు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లికి చెందిన గోరియా తన 3 ఎకరాలు 20 కుంటల భూమికి పట్టా కోసం పలుమార్లు దరఖాస్తు చేసినప్పటికీ మంజూరు కాలేదని వినతి సమర్పించారు. ఈ అంశంపై విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని టేకులపల్లి తహసీల్దార్కు ఎండార్స్ చేశారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ