తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు, గోదావరిఖని ఆసుపత్రుల్లో జరిగిన సంఘటనలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి.ఏడు నెలలుగా నిలిచి పోయిన మెడికల్ బోర్డు ను వెంటనే నిర్వహించాలి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను కోరిన గుర్తింపు సంఘం ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్.సింగరేణి లో కార్మికులు వారి కుటుంబాలు ఆరోగ్యం గా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యం అవుతుందని, నిర్లక్ష్యం గా వ్యవహరిస్తె సంస్థ మనుగడకు ప్రమాదమని, కార్మికులకు, వారి కుటుంబాలకు, రిటైర్డ్ ఉద్యోగులకు సింగరేణి ఏరియా ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిరణ్ రాజ్ ను కోరారు. గురువారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రి ని సందర్శించి అనంతం సి.ఎం.ఓ తో సింగరేణి లో ఉన్న ఆసుపత్రుల్లో జరుగుతున్న పరిణామాల పై మాట్లాడారు. సింగరేణి ఆసుపత్రుల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు సరైన వైద్య సేవలు అందక కార్మికులు, వారి కుటుంబాలు, రిటైర్డ్ ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారని, వెంటనే యాజమాన్యం అన్ని రకాల మెడిసిన్స్ తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరిఖని, మణుగూరు లో జరిగిన సంఘటన లకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి ప్రధాన ఆసుపత్రి తో పాటు అన్ని ఏరియా ఆసుపత్రుల్లో స్పెషలిస్ట్ డాక్టర్ లను, గైనకాలజిస్ట్ లను, పిల్లల డాక్టర్ లను, రేడియాలజిస్టలను, టెక్నీషియన్స్ లను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా రోగ నిర్దారణ చేసే పరికరాలైన బి.పి మిషన్లు, ఈ.సి.జి, టూడి ఏకో, స్కానింగ్, సి.టి మరియు ఎం.ఆర్.ఐ మిషను లను అందుబాటులో ఉంచాలని, కొన్ని ఏరియా హాస్పిటల్ లో విలువైన వైద్య పరికరాలు ఉన్నా వాటిని నిర్వహించేందుకు సరైన టెక్నిషియన్స్, రేడియాలజిస్టులు లేక లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన విలువైన వైద్య పరికరాలు మూలన పడి ఉన్నాయని, ముఖ్యంగా గోదావరిఖని లో ఈ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కార్మికుల ఆరోగ్యం విషయంలో యాజమాన్యం రాజీ పడకుండా అవసరమైతే కార్పొరేట్ హాస్పిటల్స్ కు పంపించి మైరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా గత కొన్ని నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, చాలా మంది కార్మికులు తీవ్ర అనారోగ్యానికి గురవడం వల్ల వారు విధులు నిర్వహించక అనేక అవస్థలు పడుతున్నారని వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేసి వారికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో డాక్టర్ లు దురుసుగా వ్యవహరిస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఉత్పత్తి దాహాంతో కార్మికుల ఆరోగ్యాన్ని దెబ్బ తీయొద్దని, వారు ఆరోగ్యంగా ఉంటేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్ తో పాటు తదితరులు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ