తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు.. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న అర్రైవ్ అ లైవ్ రహదారుల భద్రత వారోత్సవం కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డ్రైవర్లకు నిర్వహిస్తున్న ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పరీక్షా విభాగాలను కలెక్టర్ సందర్శించి, అక్కడ జరుగుతున్న పరీక్షల విధానం, ఉపయోగిస్తున్న పరికరాలు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలను సమగ్రంగా పరిశీలించారు. ఆటో డ్రైవర్లకు ప్రాథమిక దృష్టి పరీక్షలతో పాటు దూర దృష్టి , సమీప దృష్టి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే అవసరాన్ని బట్టి కంటి ఒత్తిడి, కంటి ఆరోగ్య పరిస్థితులను కూడా పరిశీలించి, వివిధ రకాల కంటి సమస్యలను ముందుగానే గుర్తిస్తున్నారు. కంటి పరీక్షలలో చూపు మందగించడం, మసకగా కనిపించడం, దూరం లేదా సమీపంలో స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలను గుర్తించి, సంబంధిత వైద్యులు తగిన సూచనలు అందిస్తున్నారు. దృష్టి లోపం ఉన్న ఆటో డ్రైవర్లకు తక్షణమే కళ్లద్దాలు అందజేసి, అవసరమైన చికిత్సకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రైవర్లకు కంటి పరీక్షలు అత్యంత ముఖ్యమని, కంటి చూపు స్పష్టంగా లేకపోతే రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు . ప్రతి డ్రైవర్ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి, నిర్దిష్ట కాల వ్యవధిలో కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రత నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న ఉచిత కంటి పరీక్షా కార్యక్రమాలను డ్రైవర్లు సద్వినియోగం చేసుకోవాలని, తమ కంటి చూపును అశ్రద్ధ చేయకుండా సమీపంలో నిర్వహించే శిబిరాల్లో పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందడం ద్వారా డ్రైవర్లు సురక్షితంగా వాహనాలు నడపగలరని, తద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు రహదారులపై భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికీ నాణ్యమైన సేవలు అందించి, అవసరమైన వారికి వెంటనే కళ్లద్దాలు, చికిత్స అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రాధ రామ్మోహన్, వైద్యులు, నర్సులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ