తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కౌజు పిట్టల పెంపకం యూనిట్, చేపల పెంపకం యూనిట్ మరియు కూరగాయల తోటను సందర్శించిన భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కౌజు పిట్టల పెంపకం ద్వారా ఆదాయ మార్గాలను విస్తరించాలని సూచించిన కలెక్టర్ 10 గుంటల స్థలం ఉన్న ప్రతి మహిళా రైతు కూరగాయలు పండించడానికి ముందుకు రావాలని, జిల్లాలో వెయ్యి మంది మహిళా రైతులను గుర్తించాలని కలెక్టర్ పిలుపు. లక్ష్మిదేవిపల్లి మండలంలోని శేశాగిరినగర్ గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైన దుర్గాంబిక గ్రామ సంఘంలోని అరుణోదయ గ్రామ సమాఖ్యలోని ప్రణజ కౌజు పిట్టల పెంపకం యూనిట్ను జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జితేష్ వి. పాటిల్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తొలిసారిగా కౌజు పిట్టల పెంపకం యూనిట్ను ప్రారంభించినందుకు మహిళా సంఘాలను అభినందించారు. ప్రతి మండలంలోని మహిళా సంఘాల సభ్యులు కూడా కౌజు పిట్టలను పెంచుకోవాలని, దాని ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి 40 రోజులకు ఒక్కసారి వీటిని అమ్ముకోవచ్చని, మార్కెట్లో వీటికి మంచి డిమాండ్ ఉందని తెలిపారు.
తదనంతరం చేపల పెంపక యూనిట్ను పరిశీలించి వారికి అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం సుజాతనగర్ మండలంలోని రవి హైబ్రిడ్ సీడ్స్ వారి క్షేత్రాన్ని సందర్శించి, వారు పండిస్తున్న అన్ని రకాల కూరగాయల తోటలను పరిశీలించారు. జిల్లాలో కనీసం 10 గుంటల స్థలం కలిగిన ప్రతి మహిళా రైతు కూరగాయల సాగు ప్రారంభించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన మౌలిక వసతులు (జిఐ వైరు, ఎదురు గడలు, పాలిథిన్ పేపర్, విత్తనాలు, పెన్సింగ్) వివరాలతో తక్కువ ఖర్చుతో డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను రెండు రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగా జిల్లాలో 1000 మంది మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పైలట్ ప్రాజెక్ట్గా లక్ష్మిదేవిపల్లి మండలంలోని రైతు వేదికలో కూరగాయల సాగు, మునగ సాగు, కొర్రమీను చేపల పెంపకం మరియు కౌజు పిట్టల పెంపకాన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టి పర్యవేక్షించాలని సూచించారు. తరువాత సుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం గ్రామంలో కొర్రమీను చేపల యూనిట్ను నిర్వహిస్తున్న శ్రీమతి మండే స్రవంతిని కలెక్టర్ అభినందించారు. అక్కడే కూరగాయలు, కౌజు పిట్టల పెంపకం చేపడితే అదనపు ఆదాయం లభిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, సుజాతనగర్ యం.పి.డి.ఓ, యం.ఆర్.ఓ, లక్ష్మిదేవిపల్లి యం.పి.డి.ఓ, ఎపియం ఫాం, రెండు మండల ఎపియంలు మరియు సిసిలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ