తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజల నుండి అందిన వినతిపత్రాలు, ఫిర్యాదులను అదనపు ఒక కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖ పిడి రవీంద్రనాథ్ తో కలసి స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో హాజరైన ప్రజలు తమ వ్యక్తిగత, సామూహిక సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా పరిశీలిస్తూ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమస్యలపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణ పరిష్కారం సాధ్యమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని, మిగిలిన వాటిని నిర్ణీత గడువులో పూర్తిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసీల్దారులు, ఎంపీడీవోలు మరియు ఇతర సంబంధిత అధికారులతో మండలాల వారీగా అందిన సమస్యలను నేరుగా చర్చించి, పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని, అధికారులు సమన్వయంతో బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్ అన్నారు. ప్రతి వినతిపత్రాన్ని సమగ్రంగా పరిశీలించి సమస్యల మూలాలను గుర్తించి దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజలు తమ ఫిర్యాదులను పూర్తి వివరాలతో పాటు అవసరమైన ఆధార పత్రాలతో సమర్పిస్తే పరిష్కారం వేగవంతమవుతుందని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి సమస్యకు సమర్థవంతమైన పరిష్కారం అందేలా అధికారులు కట్టుబడి పనిచేయాలని సూచించారు. అనంతరం వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలని, ప్రధాన కూడళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో చలివేంద్రాలు తక్షణం ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కొత్త తాండ గ్రామపంచాయతీకి చెందిన గ్రామ ప్రజలు తమ గ్రామంలో రేషన్ షాపు లేకపోవడంతో 4.5 కిలోమీటర్లు ప్రయాణించి రేషన్ బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు. గ్రామం మారుమూల ప్రాంతంలో ఉండడం వల్ల వాహన సౌకర్యం లేక వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామంలో రేషన్ డీలర్ షాపు ఏర్పాటు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్, తగు చర్యల నిమిత్తం కొత్తగూడెం ఆర్డీవోకు ఎండార్స్ చేశారు. * పాల్వంచ గాంధీనగర్కు చెందిన మంగళగిరి నాగమ్మ తనకు సర్వే నం. 817/36లో భూమి ఉన్నప్పటికీ భూభారతి ఆన్లైన్లో నిషేధిత భూమిగా చూపిస్తున్నారని, దాన్ని తొలగించాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం ధరణి ఆపరేటర్కు ఎండార్స్ చేశారు. * భద్రాచలం రాజుపేటకు చెందిన శివకుమార్ పదో తరగతి ఉత్తీర్ణుడై 80 శాతం దివ్యాంగుడిగా ఉండి కుటుంబ పోషణ కష్టంగా మారిందని, దివ్యాంగుల కోటాలో మోటార్ బైక్ మంజూరు చేయాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం సంబంధిత దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. * ఇల్లందు ఎల్బీఎస్ నగర్కు చెందిన తాటి లాలయ్య తాను దివ్యాంగుడిగా 2022లో 70% అంగవైకల్యంతో సదరం సర్టిఫికేట్ పొందినప్పటికీ ఇప్పటివరకు వికలాంగుల పెన్షన్ మంజూరు కాలేదని చేసిన దరఖాస్తును పరిశీలించి తగు చర్యల నిమిత్తం డీఆర్డీఓకు ఎండార్స్ చేశారు. * చర్ల మండలం ఆనంద కాలనీకి చెందిన ప్రజలు తమ గ్రామంలో కొంతమంది అర్హత లేని వ్యక్తులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఎస్టీ కుల ధ్రువీకరణ పొందుతున్నారని, దీనివల్ల నిజమైన గిరిజనులకు సంక్షేమ పథకాలు మరియు ఉద్యోగ అవకాశాల్లో నష్టం జరుగుతోందని, ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసిన దరఖాస్తును పరిశీలించి డీ-సెక్షన్ ఓఎస్డీకి ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ