తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, హమాలీ, రవాణా తదితర ఏర్పాట్లు సక్రమంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు . జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్యాక్స్ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు మొత్తం 3,76,288 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు తెలిపారు. అందులో 2,19,729.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలలో 1,56,558.5 క్వింటాళ్ల మొక్కజొన్న నిల్వ ఉన్నట్లు తెలిపారు . మంగళవారం ఒక్కరోజులోనే 10,091.5 క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించినట్లు తెలిపారు. రవాణా కోసం 458 లారీలు, 131 ట్రాక్టర్లు వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. అదనంగా మరో 1,50,000 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.యెల్లందు, టేకులపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, పాల్వంచ, జూలూరుపాడు, గుండాల, అల్లపల్లి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నను త్వరితగతిన గోదాములకు తరలిస్తూ కొనుగోలు ప్రక్రియను నిరంతరాయంగా నిర్వహిస్తున్నామని అన్నారు . రైతుల ఖాతాల్లో చెల్లింపులు వేగంగా జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆ ప్రకటనలో తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ