తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జనరల్ అబ్జర్వర్ సర్వేశ్వర్ రెడ్డి, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ లావణ్య, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పోలీసు అధికారులు, ఎన్నికల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. మొదటి విడత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రెండవ విడతలో ఎటువంటి లోపాలకు తావులేకుండా ఖచ్చితమైన ప్రణాళికతో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి తాగునీరు, భోజనం, విద్యుత్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు వంటి అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, రిజిస్టర్లు మరియు ఇతర ఎన్నికల సామగ్రిని నిర్ణీత ప్రకారం పోలింగ్ కేంద్రాలకు సమయానుసారంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సామాగ్రి తరలింపుకు అవసరమైన వాహనాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని, ఏదైనా ఆలస్యం చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో రద్దీ ఏర్పడకుండా తగిన ఏర్పాటు చేయాలని, ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటర్ రిజిస్టర్ను కచ్చితంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఓటరును రిజిస్టర్తో సరిపోల్చి ధృవీకరించిన తరువాతే ఓటు వేయడానికి అనుమతించాలని, దొంగ ఓట్లకు ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదని అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ను తప్పనిసరిగా అమలు చేసి, వీడియో కెమెరాలు బ్యాలెట్ బాక్సులను నిరంతరం పర్యవేక్షించే విధంగా అమర్చాలని సూచించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను తరలించేందుకు అవసరమైన వాహనాలు ముందుగానే సిద్ధంగా ఉంచి, నిర్ణీత రూట్మ్యాప్ ప్రకారం తరలించాలన్నారు.కౌంటింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, రెండు వేలకుపైగా ఓటర్లు ఉన్న జగన్నాధపురం, నరసాపురం, పెద్దిరెడ్డిగూడెం, వినాయకపురం, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట తదితర ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాలని ఆదేశించారు. కౌంటింగ్ హాళ్లలో అవసరమైనన్ని టేబుళ్లు ఏర్పాటు చేసి ప్రక్రియను సజావుగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఆదివారం పోలింగ్ రోజున ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ జరుగనున్నందున, ఓటర్లలో అవగాహన పెంచేందుకు పంచాయతీ వాహనాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున పోలింగ్ అనంతరం ర్యాలీలు, విజయోత్సవాలు నిర్వహించేందుకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల సిబ్బందికి భోజనం, తాగునీరు, రవాణా వంటి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, రెండవ విడత ఎన్నికలు పూర్తి శాంతి భద్రతల మధ్య జరగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పోలింగ్ ముగిశాక కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ