తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు అన్ని పరిశ్రమలు సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లాలో SCA, ADP, DMFT, CRS, PMKSY, Article 275,NABARD మరియు TGFDC నిధుల ద్వారా పురోగతిలో ఉన్న పనులు మరియు చేపట్టనున్న పనులపై జిల్లాలోని సింగరేణి, కే టి పి ఎస్, బి టి పి ఎస్, నవభారత్, ఐ టి సి, టీ జి ఎఫ్ డి సి పరిశ్రమల ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మరియు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కేటాయించిన అన్ని రకాల నిధులను సద్వినియోగం చేసుకొని జిల్లా అభివృద్ధి సాధించాలని అన్నారు. జిల్లాలోని అన్ని పరిశ్రమలు వారు సి ఎస్ ఆర్ కింద ఎంత నిధులు మంజూరు చేస్తారో మే 15 లోపల నివేదికలు అందించాలని కలెక్టర్ అన్నారు. దీని ద్వారా జిల్లాలో ఎక్కడ అభివృద్ధి చేయాలి అనేది ప్రణాళికలు రూపొందించవచ్చని తెలిపారు. పరిశ్రమలు తమ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలన్నారు. పరిశ్రమలు కేటాయించే సిఎస్ఆర్ నిధులను విద్య, వైద్యం, త్రాగునీరు మరియు అంగన్వాడీల అభివృద్ధికి కేటాయిస్తామని తెలిపారు. పరిశ్రమలు కేటాయించే సి ఎస్ ఆర్ నిధులు 20 శాతం స్థానిక అవసరాలకు 80 శాతం ఇతర అవసరాలకు కేటాయిస్తామన్నారు. సి ఎస్ ఆర్ కింద పరిశ్రమలు గత సంవత్సరంలో మంజూరు చేసిన నిధుల వివరాలు తెలియజేయాలన్నారు. నవభారత్ వారు నిర్వహిస్తున్న వృత్తి విద్య తరగతులు పై విస్తృత ప్రచారం కల్పించాలని అదేవిధంగా నవభారత్ లో తయారయ్యే ఇటుకలు కేవలం 6 రూపాయలకే విక్రయిస్తున్నారని వాటిని ప్రభుత్వ కట్టడాలకు అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవడం ద్వారా నిర్మాణవ్యయం తగ్గుతుందని కలెక్టర్ తెలిపారు. నవభారత్ పరిసర ప్రాంతాలైన జగ్గు తండా మరియు ఎర్ర తండా అభివృద్ధికి మరియు వారి త్రాగునీటి ఇబ్బందులను తొలగించడానికి 50 శాతం నిధులు కేటాయించాలన్నారు. సెక్షన్ 135 షెడ్యూల్ 7 ద్వారా పరిశ్రమలు తమ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ కోరారు. టీ జి ఎఫ్ డి సి పరిధిలో అడవిలో వెదురు, సుబాబులు, ఇప్ప, కరక్కాయ, చింత, వేప మరియు ఉసిరి విస్తృతంగా నాటడం ద్వారా గిరిజనులకు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 27 వేల ఎకరాల్లో టిటిసి సంస్థ కోసం జామ్ ఆయిల్ సాగు రైతులు చేపడుతున్నారని, కానీ ఆ జామాయిల్ ఆకుల ద్వారా ఆయిల్ తయారీ చేయడానికి రైతులకు అవగాహన కల్పించేలా ఐటీసీ సంస్థ వారు చర్యలు చేపట్టాలని అన్నారు. దానికిగాను ఐటిసి సంస్థ ప్రతినిధి పైలెట్ ప్రాజెక్టుగా ఆకులు సేకరించి ఆయిల్ ఎంత పరిమాణంలో వస్తుందో పరిశీలించి అమలు చేస్తామని కలెక్టర్ కు తెలిపారు. ఆర్టికల్ 275 ద్వారా జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్ ద్వారా అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్ థియేటర్లు, మార్చురీలు తదితర నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎస్ సి ఎ,ADP, నాబార్డ్, PMKSY నిధులను పూర్తిస్థాయిలో వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరిశ్రమల ప్రతినిధులకు జిల్లాలో ఆరు నెలల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా 84 లక్షలు వ్యయంతో నిరుద్యోగ యువతకి ప్రభుత్వ ఐటిఐ ద్వారా వెల్డింగ్ పై శిక్షణ ఇచ్చి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఆస్పిరేషనల్ జిల్లా అభివృద్ధిలో భాగంగా జిల్లాలోని గ్రంథాలయాల్లో పుస్తకాలు, ఫ్యాన్లు, లైట్లు వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. వైద్య శాఖ పరిధిలో కేవలం ఒక్క రోజులోనే జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరం ఉన్నచోట ఫ్యాన్లు బిగించామన్నారు. డి ఎం ఎఫ్ టి నిధుల ద్వారా జిల్లాలోని అన్ని అంగన్వాడి లలో విద్యుదీకరణ పనులు పూర్తి చేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలో త్రాగునీటి సమస్య పరిష్కరించే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పోలీస్ శాఖలో వారికి కావలసిన సౌకర్యాల కల్పనకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుళ్లు ఉన్నప్పటికీ చాలా చోట్ల మరుగుదొడ్లు లేవని, అదేవిధంగా అవసరమైనన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కాబట్టి అన్ని పరిశ్రమల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ సమీక్ష సమావేశంలో సిపిఓ సంజీవరావు, వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, పంచాయతీరాజ్ ఈ ఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈ ఈ వెంకటేశ్వరరావు, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, మిషన్ భగీరథ ఈ ఈ లు తిరుమలేష్, నలిని, మరియు సింగరేణి, నవభారత్, కేటీపీఎస్, బి టి పి ఎస్, ఐ టి సి పరిశ్రమల ప్రతినిధులు మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ