తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సమానత్వానికి పునాది భారత రాజ్యాంగం: ఎస్పీ రోహిత్ రాజు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ ప్రధాన కూడలిలో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రజలు స్వయంగా పరిపాలించుకునే విధంగా రాజ్యాంగం అవసరమైందని, దేశ వ్యాప్తంగా అనేక మంది మేధావులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగల వ్యక్తిగా గుర్తించబడినట్లు తెలిపారు. భారత రాజ్యాంగం రూపకల్పనలో ఆయన చేసిన కృషి అపూర్వమని, విద్య, ఆర్థిక, నీటిపారుదల తదితర రంగాలలో ఆయన చూపిన దూరదృష్టి దేశాభివృద్ధికి పునాది అయిందన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాయని, “ఒక వ్యక్తి – ఒక ఓటు” అనే సూత్రాన్ని స్థిరపరిచిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని అన్నారు . కుల, మత భేదాలకు అతీతంగా సమానత్వ భావనను నెలకొల్పిన ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు .
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ , విభిన్న కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు కలిగిన దేశం అయినప్పటికీ భారతదేశం ఐక్యంగా నిలబడటానికి ప్రధాన కారణం రాజ్యాంగమని అన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత రాజ్యాంగం చాలా తక్కువ సవరణలతోనే సమర్థవంతంగా కొనసాగుతుండటం అంబేద్కర్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. సమాజంలో మానవతా విలువలకు ప్రాధాన్యం ఇస్తూ, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా జీవించేలా కృషి చేయాలని, అంబేద్కర్ స్ఫూర్తిని ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల గోడపత్రికను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్-అలైవ్" (Arrive Alive) కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రహదారుల భద్రతపై ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం, హెల్మెట్ మరియు సీట్బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా అనుసరించడం, మద్యపానం చేసి వాహనం నడపకపోవడం, వేగ నియంత్రణ పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ప్రజల ప్రాణ రక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు సామూహికంగా కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టర్ జడ్పీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి శ్రీలత, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరమణ, తూనికలు కొలతలు శాఖ అధికారి మనోహర్, వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, జిల్లా అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు డాక్టర్ మద్దెల శివకుమార్, సబ్బారపు మధుసూదన్ రావు, పీక కృష్ణ, కుసపాటి శ్రీనివాస్, కోలపూరి ధర్మరాజు, సలింగటి శ్రీనివాస్, కమిటీ కో-కన్వీనర్లు, సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ