తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : స్వాతంత్ర్య సమరయోధుడు,నవభారత నిర్మాత,మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ గారి జయంతిని పురస్కరించుకుని ఈ రోజు జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జగ్జీవన్రామ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ఆయన సేవలను స్మరించుకున్నారు.అనంతరం ఎస్పీ మాట్లాడుతూ బాబు జగ్జీవన్రామ్ 1908లో బీహార్ రాష్ట్రంలోని ఒక పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి దేశ అత్యున్నత పదవులను అధిష్టించిన మహనీయుడని కొనియాడారు.చిన్నతనం నుండే సమాజంలో ఉన్న కుల వివక్షకు,అంటరానితనానికి వ్యతిరేకంగా గళమెత్తిన ఆయన,విద్యనే ఆయుధంగా మలచుకుని అన్యాయాలపై పోరాడారని పేర్కొన్నారు.స్వతంత్ర భారత తొలి క్యాబినెట్లో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగ్జీవన్రామ్ గారు కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక చట్టాలను అమలు చేసినట్లు ఎస్పీ వివరించారు.బాబు జగ్జీవన్రామ్ గారి జీవితం ఒక తెరిచిన పాఠశాల వంటిదని,సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయమని ఎస్పీ అన్నారు.ఆయన ఆశయాలకు అనుగుణంగా సమానత్వం,సోదరభావం కలిగిన సమాజాన్ని నిర్మించడం మనందరి బాధ్యత అని ఎస్పీ పిలుపునిచ్చారు.అణగారిన వర్గాల అభ్యున్నతికి,దేశ సమగ్రతకు కృషి చేయడమే ఆ మహనీయునికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొంటూ,మాతృదేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,వన్ టౌన్ సీఐ కరుణాకర్,ఎంటిఓ సుధాకర్,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,ఎస్సైలు ప్రవీణ్,రవి,రామకృష్ణ,మనీషాలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ