తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ గురుకుల పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో గల బాలుర గురుకుల పాఠశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా ఎస్పి రోహిత్ రాజు పాఠశాల విద్యార్థుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి,అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల పరిధిలో మొక్కలు నాటారు. అనంతరం మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక లాంటివారు, క్షణకాలపు ఆనందం కోసం మత్తు పదార్థాల వైపు ఆకర్షితులై, తమ బంగారు భవిష్యత్తును, తల్లిదండ్రుల ఆశలను చేతులారా నాశనం చేసుకుంటున్నారని, మాదక ద్రవ్యాల వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేశారు. విద్యార్థులు స్నేహితుల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, వైజ్ఞానిక పరిజ్ఞానం పిల్లలకు అవసరమని, సినిమాలలోని మంచిని గ్రహించి చెడుని వదిలేయాలని, చదువుల్లో లేదా వ్యక్తిగత జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనానికై క్రీడలపై ఆసక్తి చూపాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల ప్రవర్తన కదలికలను గమనిస్తూ ఉండాలని సూచనలు చేశారు. అనంతరం సైబర్ నేరాల గురించి మాట్లాడుతూ అత్యాశకు పోయి త్వరితగతిన డబ్బును సంపాదించాలనే ఆలోచనతో చాలామంది సైబర్ నేరాల బారిన పడి కష్టపడి సంపాదించిన నగదును కోల్పోతున్నారని,చదువుకున్నవారే ఎక్కువమంది సైబర్ నేరాలు బారిన పడుతున్నారని తెలిపారు.ఓటీపి ట్రాప్,ఆన్లైన్ ట్రేడింగ్,సోషల్ మీడియాల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి వివరించారు. విద్యార్థినులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, మహిళల భద్రతపై పలు సూచనలు చేశారు. మహిళలకు, విద్యార్థినులకు రక్షణగా జిల్లాలో షీ టీమ్స్ పనిచేస్తున్నాయని, అత్యవసర సమయాల్లో 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచనలు చేశారు. అనంతర రోడ్డు భద్రతా నియమాలను పాటించడంలో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చని, హెల్మెట్ వినియోగం,సీటు బెల్ట్ ప్రాధాన్యత,డిఫెన్సివ్ డ్రైవింగ్ నియమాల గురించి వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్,ర్యాష్ డ్రైవింగ్,సెల్ఫోన్ డ్రైవింగ్,రాంగ్ రూట్,సిగ్నల్ జంపింగ్,ఓవర్ లోడ్ వలన కలిగే ప్రమాదాల గురించి వివరించారు. సుమారు 300మందికి పైగా విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పి ఆర్. సతీష్ కుమార్, ఎస్బిఐ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పాల్వంచ సీఐ సతీష్, ఎక్సైజ్ సీఐ ప్రసాద్, పోలీసు అధికారులు, పాఠశాల మరియు కళాశాల, అధ్యాపకులు,ఉపాధ్యాయులు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ