తెలుగు వెలుగు టీవీ - వార్తలు / అశ్వారావుపేట : "పిల్లలూ.. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి?. మంచిగా చదువుకుంటున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మేము ఎవరో తెలుసు కదా...? చెప్పండి. మీ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తాం. బాగా చదువుకోండి మరి" అంటూ.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి విద్యార్థులతో అన్నారు. మంగళవారం అశ్వారావుపేట మండలం సున్నం బట్టి గ్రామంలో గల ఆశ్రమ పాఠశాల, వసతి గృహాలను తనిఖీ చేశారు. ప్రాంగణమంతా కలియతిరిగి, వంటగది, విద్యార్థుల గదులు పరిశీలించారు. అనంతరం పిల్లలతో కాసేపు మాట్లాడారు. ఆ వివరాలు ఇలా. మీ కలెక్టర్, ఎస్పీ సార్ మాదిరి ఉన్నతంగా నిలవాలి మీకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాగా చదివి మీ కలెక్టర్ జితేష్ వీ.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ మాదిరిగా మంచి ఉన్నత స్థానాల్లో ఉండాలని మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాంరెడ్డి సూచించారు. అక్కడున్న ఓ బాలుడు తన పేరు మహేష్ అని చెప్పగా.. నువు పెద్దయ్యాక హీరో మహేష్ బాబు లాగా అవుతావా మరి అని అడగడంతో అక్కడున్న వారంతా నవ్వారు. మేమెవరమో తెలుసు కదా.. అరేయ్ పిల్లలూ.. నేను తెలుసు కదా అని పిల్లలను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రశ్నించారు. దీంతో చాలామంది వో.. తెలుసంటూ తలలూపారు. ఆ తర్వాత మంత్రి పొంగులేటి ఎంపీ రఘురాంరెడ్డిని, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ను, కలెక్టర్, ఎస్పీలను పిల్లలకు పరిచయం చేశారు. ఆ గుగ్గిళ్ళు సరిపోతున్నాయా..? కాసేపు పిల్లలతో సరదా సంభాషణ ఈ హాస్టల్లో 110 మంది పిల్లలు ఉంటే ఆ చిన్న గిన్నెలో గుగ్గిళ్ళు ఉడక పెడుతున్నారు.. అవి సరిపోతాయా రా మీకు..? అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించడంతో అక్కడున్న పిల్లలు.. పెద్దలు సరదాగా నవ్వుకున్నారు. చికెన్ ఎప్పుడు పెడుతున్నారు.. భోజనం బాగుంటుందా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. అంటూ మంత్రి, ఎంపీ ప్రశ్నించారు. మాకు బెడ్ షీట్లు, బంగాళదుంప కూర కావాలి తమకు బెడ్ షీట్లు, పరుపులు లేవని.. అందరికీ పూర్తిస్థాయిలో అందలేదని విద్యార్థులు మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి ఎదుట వాపోయారు. దీనికి మంత్రి, ఎంపీ స్పందిస్తూ తప్పకుండా ఈ సమస్యలు పరిష్కరిస్తామని..మీరు బాగా చదువుకోవాలి అని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ