తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి (DM&HO) ఈరోజు సుజాతనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) సందర్శించి రాబోయే మిషన్ హెల్త్–100 ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను విపులంగా పరిశీలించారు. ఈ సందర్భంగా స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ గదులు, ప్రయోగశాల సేవలు, ఔషధ పంపిణీ కేంద్రం (ఫార్మసీ), రిజిస్ట్రేషన్ మరియు హెల్ప్డెస్క్ కౌంటర్లు, రోగుల కోసం వేచిచూసే ప్రదేశాలు, త్రాగునీరు మరియు పారిశుద్ధ్య సదుపాయాలు, ఐఈసీ (IEC) ప్రచార బోర్డులు, దిశా సూచికలు (Sign Boards), బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ విధానం, రోగుల రాకపోకల సమన్వయం వంటి అన్ని అంశాలను సమగ్రంగా సమీక్షించారు. శిబిరానికి హాజరయ్యే లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సక్రమ ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని, స్పెషలిస్ట్ వైద్యులతో సమన్వయం పాటించాలని, అవసరమైన ఔషధాలు మరియు ల్యాబ్ పరీక్షలు అందుబాటులో ఉంచాలని, ప్రతి విభాగం సమయపాలనతో పని చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు. అనంతరం నిర్వహించిన ఆశా దినోత్సవ సమావేశంలో DM&HO పాల్గొని ఆశా కార్యకర్తలు, ANMs మరియు ఇతర సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. మిషన్ హెల్త్–100 కార్యక్రమం ప్రధాన లక్ష్యాలను వివరించి, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలను సమగ్ర ఆరోగ్య ప్రొఫైల్ స్క్రీనింగ్కు సమీకరించడం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు మరియు ఇతర అవసరమైన లబ్ధిదారులు శిబిరానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి వైద్య కేంద్రంలో ఫ్యామిలీ ప్లానింగ్ కార్నర్ను బలోపేతం చేసి, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, అన్ని ఆరోగ్య సూచికలను మెరుగుపరచే దిశగా కృషి చేయాలని సూచించారు. ఫీల్డ్ స్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి, మిషన్ హెల్త్–100 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రోత్సహించారు. ఇక జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా DM&HO సందర్శించి రేపు నిర్వహించనున్న మిషన్ హెల్త్–100 ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాట్లను సమీక్షించారు. ఈ శిబిరంలో ఆరు విభాగాల నిపుణ వైద్యులు సేవలు అందించనున్నారు: సాధారణ వైద్య నిపుణుడు కంటి వైద్య నిపుణుడు ఎముకల వైద్య నిపుణుడు స్త్రీరోగ నిపుణుడు శిశు వైద్య నిపుణుడు దంత వైద్య నిపుణుడు తమ పరిధిలోని అన్ని గ్రామాలలో మైకింగ్ ప్రకటనలు నిర్వహించి, అవసరమైన లబ్ధిదారులను శిబిరానికి సమీకరించాలని వైద్య అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా శిబిరానికి హాజరుకావాలని ప్రచారం చేయాలని సూచించారు. మిషన్ హెల్త్–100 కార్యక్రమం మిగిలిన 99 రోజుల్లో స్వయం సహాయక సంఘాల మహిళల ఆరోగ్య ప్రొఫైల్ స్క్రీనింగ్ను వేగవంతం చేసి, జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఆరోగ్య సేవలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా పని చేయాలని స్పష్టం చేశారు. అదేవిధంగా పాల్వంచ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయం నందు సంత్ సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని భోగ్ బండారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.. ఈ కార్యక్రమంలో వైద్య మరియు ఆరోగ్య శాఖకు సంబంధించిన బంజారా ఉద్యోగ సిబ్బంది హాజరు అవ్వడం జరిగినది .
Admin
తెలుగు వెలుగు టీవీ