తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీతారామ ఎత్తిపోతల పథకం కెనాల్ భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీతారామ ఎత్తిపోతుల పథకం కెనాల్ భూ సేకరణ పై ఇరిగేషన్ మరియు సర్వే అధికారులతో కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతారామ కెనాల్ నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామసభలు నిర్వహించాలన్నారు. జిల్లావ్యాప్తంగా వారం రోజుల్లోగా గ్రామసభలు నిర్వహణ పూర్తి చేయాలన్నారు. కాల్వల ఏర్పాటుతో రైతులకు భూమి విలువ పెరుగుతుందని అవగాహన కల్పించాలన్నారు. ఇరిగేషన్ అధికారులు సర్వేయర్లు సమన్వయంతో భూసేకరణ పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేయర్లకు అవసరమైన ఆధునిక యంత్ర పరికరాలు, లాప్టాప్ లు అందజేస్తామన్నారు. భూ సర్వే లో ఆధునిక పద్ధతులను అవలంబించి వేగవంతంగా భూ సర్వే పూర్తి చేయాలన్నారు. భూ సర్వే లో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ అధికారులు జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులలో పూడిక తీయు విధంగా ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. చెరువుల వద్ద మార్కింగ్ ఏర్పాటు చేసి అవసరమైన రైతులకు పొలాల్లో ఉపయోగించుకునేందుకు మట్టిని తీసుకు వెళ్లే విధంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించాలన్నారు. చెరువులన్నిటిలో పూడిక తీయడం ద్వారా నీటి నిల్వలు పెంచుకోవచ్చని ఆయన అధికారులకు సూచించారు. అధికారులందరూ దీనిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి అన్ని చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలన్నారు. చెరువులు మరియు కాలువల వెంట సుబాబులు, తంగేడు తాటి చెట్లను విస్తృతంగా నాటే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా కాల్వల వెంట పిల్ల కాలువల నిర్మాణం మరియు పరిశుభ్రత పాటించాలని అధికారులను ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అవసరమైన సాండ్ బ్యాగులు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లు కాశయ్య, సుమ, ఇరిగేషన్ శాఖ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి, ఈ ఈలు అర్జున్ రావు, సురేష్ కుమార్ అశ్వరావుపేట, ఇల్లందు ఈఈ చారి, మరియు డి ఈ లు,సర్వేయర్లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ