తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం , పాల్వంచ జనవరి 26 ( తెలుగు వెలుగు) పాల్వంచ మండలంలోని నవభారత్ కి చెందిన నవనగర్ కాలనీలోని క్వార్టర్స్ లో దొంగలు పడి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకుపోయిన సంఘటన ఆదివారం జరిగింది. నవ నగర్ లోని క్వార్టర్స్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్, ప్రతాప్, అంజద్ పాషాల క్వాటర్స్ తో పాటు మరో ఏడు క్వార్టర్స్ లో దొంగలు చొరబడ్డారు. ఎన్బి-47 క్వార్టర్ లో నివాసముంటున్న విజయ్ ప్రకాష్ ఇంట్లో సుమారు 30 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.3.5 లక్షల నగదుని చోరులు అపహరించారు. క్వార్టర్స్ లోకి చొరబడ్డ దొంగలు ఆయా ఇళ్లల్లోని సామాగ్రిని, బట్టలను చిందరవందరగా పడవేసి హల్చల్ చేశారు. అదేవిధంగా బి-11 క్వార్టర్లో నివాసముంటున్న ప్రతాప్ ఇంట్లో సుమారు 61 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు దోచుకు వెళ్లారు. బి-16 క్వార్టర్లోని అంజద్ పాషా ఇంట్లో సుమారు 8 తులాల బంగారం అపహరించు కెళ్ళారు. అదేవిధంగా మిగతా క్వార్టర్స్ లో కూడా చోరీ చోరీ జరిగినట్లు తెలుస్తున్నప్పటికీ ఆయా యజమానులు ఇంకా నవ నగర్ కు చేరుకోలేదు. సరిగ్గా ఆ క్వార్టర్స్ లో నివాసముండే యజమానులు లేని సమయాన్ని అదునుగా చూసి దొంగలు చొరబడి దోచుకుపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ కాలనీలో గేటెడ్ కమ్యూనిటీ అయినప్పటికీ కేవలం ఎంట్రన్స్ లో మాత్రమే రెండు సీసీ కెమెరాలు అమర్చారు. కాలనీలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేకపోవడం, నిఘ వైఫల్యం వల్లే ఈ దొంగతనం జరిగినట్లుగా అవగతం అవుతుంది. సమాచారం తెలుసుకున్న పాల్వంచ సీఐ సతీష్, ఎస్సైలు సుమన్, రామారావు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంని రంగంలోకి దించారు. ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఎంత మేరకు నగదు, బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి అనే విషయం తెలియాల్సి ఉంది.
Admin
తెలుగు వెలుగు టీవీ