తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : క్రమశిక్షణ, పట్టుదలే యువతను ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలి వేసవి ఎండల దృష్ట్యా క్రీడాకారులు జాగ్రత్తలు తీసుకోవాలి స్నేహపూర్వక వాతావరణంలో ప్రతిభను నిరూపించుకోవాలి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా యువత క్రీడా, సాంస్కృతిక రంగాలపై దృష్టి సారించాలని, అప్పుడే సమగ్ర వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదాన్'లో ఆదివారం స్టాలిన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రగతి ప్రీమియర్ లీగ్ సెషన్-2 క్రికెట్ టౌర్నమెంటును కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదల ఉంటేనే యువత జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోగలరని పేర్కొన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, వాటిని సమానంగా స్వీకరిస్తూ మైదానంలో నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున క్రీడాకారులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని సూచించారు. మైదానంలో స్నేహపూర్వక వాతావరణంలో ఆడుతూ ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను నిరూపించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, యువతలో ఐక్యతను పెంపొందించడానికి దోహదపడతాయని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 50 డివిజన్ కార్పొరేటర్ దాసరి శ్రీనివాస్, నిర్వాహక కమిటీ సభ్యులు స్టాలిన్, జేమ్స్, అజయ్, చక్రధర్, బిట్టు, సాయి, అజయ్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ