తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి.భూసేకరణ, పరిహారం చెల్లింపుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆర్&ఆర్, ఇరిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు.జిల్లాలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించాలని ఆర్&ఆర్, ఇర్రిగేషన్ భూసేకరణ కమిషనర్ కె. శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అశ్వాపురం మండలంలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టు, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదటి పంప్ హౌస్ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం బీజీ కొత్తూరులోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి పంప్ హౌస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అంకిత్తో కలిసి భూసేకరణ పురోగతిపై సమీక్ష నిర్వహించారుఈ సందర్భంగా జిల్లాలోని సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టులతో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, అటవీ అనుమతులు, సర్వే పనులు, కోర్టు కేసుల పురోగతిపై ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు. ప్రాజెక్టుల అమలులో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి, భూసేకరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.రైతులకు న్యాయమైన పరిహారం అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవార్డుల జారీ మరియు పరిహారం చెల్లింపుల ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్ అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫేజ్–1 కింద 1,522 ఎకరాల భూసేకరణకు గాను మొత్తం అవార్డులు జారీ చేసినట్లు తెలిపారు. ఫేజ్–2లో 2,365 ఎకరాలకు అవార్డులు జారీ చేసి భూనిర్వాసితులకు పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఫేజ్–3లో 1,621 ఎకరాలకు గాను 1,350 ఎకరాలకు అవార్డులు జారీ చేయగా, 903 ఎకరాలకు పరిహారం చెల్లించి భూములను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన భూములకు సంబంధించి ప్రభుత్వ నిధులు అందిన వెంటనే పరిహారం చెల్లింపులు పూర్తి చేస్తామని చెప్పారు. డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీలు–1, 2, 6లకు సంబంధించిన భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నట్లు వివరించారు.అలాగే సీతమ్మసాగర్ బహుళార్ధక ప్రాజెక్టు, పులుసుబొంత, సింగభూపాలెం ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పురోగతిని కమిషనర్కు వివరించారు. భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, ఎస్డీఎల్సీలు రవీంద్రనాథ్, వెంకట్రావు, మండల తహసీల్దార్లు, భూసేకరణ విభాగ అధికారులు రమేష్, యాసీన్ పాషా తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ