తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జూన్ 4, 6, 8, 10 తేదీలలో నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై బుధవారం జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లడం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించడం, గ్రామాలు, వార్డుల స్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టడం లక్ష్యంగా గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలాల పరిధిలోని గ్రామాలను నాలుగు క్లస్టర్లుగా, మున్సిపాలిటీల పరిధిలోని వార్డులను కూడా క్లస్టర్లుగా విభజించి ప్రణాళికాబద్ధంగా సభలను నిర్వహించాలని సూచించారు. గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజలకు వానాకాల సన్నద్ధత, పారిశుధ్య నిర్వహణ, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, చెరువులు మరియు జల వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కల నాటకం మరియు సంరక్షణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రతి గ్రామం, వార్డులో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజల భాగస్వామ్యంతో కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, పంటల మార్పిడి విధానం, ఎరువుల సమతుల వినియోగం, ఫార్మా రిజిస్ట్రేషన్, వానాకాల సాగుకు సంబంధించిన సూచనలపై అవగాహన కల్పించాలని తెలిపారు. అదేవిధంగా జనగణన కార్యక్రమం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని అన్నారు . విద్యుత్, నీటిపారుదల, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన సేవలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ, వార్డు సభల్లో విస్తృతంగా వివరించాలని ఆదేశించారు. ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొనేలా ముందస్తుగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. గ్రామ, వార్డు సభలకు ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని, సభల నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గ్రామ, వార్డు సభలను సమర్థవంతమైన వేదికలుగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ