తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించే విధంగా వేగవంతమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, గృహ నిర్మాణ శాఖాధికారి రవీంద్రనాథ్లతో కలిసి కలెక్టర్ ప్రజల వినతిపత్రాలను స్వయంగా స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించగా, వాటిని శ్రద్ధగా విన్న కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు వెంటనే ఎండార్స్ చేసి తక్షణ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అర్హులైన వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజావాణి ద్వారా అందిన ప్రతి ఫిర్యాదుపై శాఖాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేపట్టి పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్ లేకుండా నిర్ణీత గడువులో చర్యలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పరిపాలన అందించడంలో అధికారులు కట్టుబడి ఉండాలని తెలిపారు.
ప్రజావాణిలో స్వీకరించిన కొన్ని దరఖాస్తులు: కొత్తగూడెం సన్యాసి బస్తీకి చెందిన ఉమామహేశ్వరి 54 శాతం వికలాంగతతో పెన్షన్ పొందుతూ ఉండగా, గత కొన్ని నెలలుగా పెన్షన్ నిలిచిపోయినట్లు తెలిపారు. వికలాంగుల సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ పునరుద్ధరణ కాలేదని పేర్కొన్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని తెలియజేస్తూ పునరుద్ధరణ చేయాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల కోసం డీఆర్డీఓకు ఎండార్స్ చేశారు. టేకులపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బానోతు తోలచంద్ తనకు కంపార్ట్మెంట్ నెం. 17లో 5.19 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ ఆర్ ఓ ఎఫ్ ఆర్ పట్టా బుక్ ఇప్పటివరకు అందలేదని తెలిపారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యల నిమిత్తం జిల్లా అటవీ శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. సుజాతనగర్కు చెందిన నునావత్ కుమార్ రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకొని నాలుగు నెలలు గడిచినా మంజూరు కాలేదని, కుటుంబ పోషణ కష్టంగా మారిందని తెలిపారు. ఈ దరఖాస్తును పరిశీలించి తగు చర్యల కోసం జిల్లా పౌర సరఫరాల అధికారికి ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం మర్రిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పది గ్రామాల ఆదివాసీ ప్రజలు ప్రభుత్వ వైద్యశాల లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశారు. ముఖ్యంగా రాత్రివేళ వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుపుతూ,గ్రామంలో వైద్యశాల ఏర్పాటు చేయాలని కోరగా, ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ఇల్లందు మండలం అశోక్నగర్ గ్రామానికి చెందిన ఎల్లబోయిన రాణి పీజీ వరకు చదివి నిరుద్యోగిగా ఉన్నానని, ఔట్సోర్సింగ్లో ఉపాధి కల్పించాలని కోరారు. ఈ దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి ఎండార్స్ చేశారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, వసతి గృహాలలో మెనూ ప్రకారం ఆహారం అందించడం జరగడం లేదని గుర్తించినట్లు తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, పాఠశాలలు మరియు వసతి గృహాల పర్యవేక్షణ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యాసంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షణ చేపట్టాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. వారంలోపల జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉన్న లోపాలను గుర్తించి సరిచేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. అలాగే ప్రజావాణి కార్యక్రమానికి మండల ప్రత్యేక అధికారులు హాజరు కాకపోవడంపై గల కారణాలు ఆరా తీసి , ఇకపై తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు తక్షణ చర్యలు తీసుకుని స్పందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ