తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.100 కిలోమీటర్ల రాష్ట్ర రహదారి నవీకరణతోనే పారిశ్రామిక వృద్ధి సాధ్యం.పరిశ్రమలు, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలకం ఇది వ్యూహాత్మక అనుసంధానం. బొగ్గు రవాణా, భద్రాచలం పుణ్యక్షేత్రానికి మెరుగైన సౌకర్యం.తూర్పు, మధ్య తెలంగాణ ఆర్థిక పురోగతికి జాతీయ రహదారి ఎంతో కీలకం.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే.కొత్తగూడెం నుండి తల్లాడ మీదుగా జగ్గయ్యపేట వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి అభివృద్ధి చేయడం ఎంతో అవసరమని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ మేరకు న్యూఢిల్లీలో రోడ్డు రవాణా, హైవేస్ కేంద్ర మంత్రి నితిన్ జైరాం గడ్కరిని, రాష్ట్ర రాజధానిలో రోడ్లు భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డికి ఆయన లేఖలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సుమారు వంద కిలోమీటర్ల పొడవు కలిగి, కొత్తగూడెం (ఎన్ హెచ్-30) - వైరా - జగ్గయ్యపేట (ఎన్ హెచ్-65) లను అనుసంధానించే ఈ రహదారి తెలంగాణలోని ప్రధాన పారిశ్రామిక, వాణిజ్య, వ్యవసాయ మరియు గిరిజన ప్రాంతాలను కలిపే వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన రాష్ట్ర రహదారి అని వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో సింగరేణి, కేటీపీఎస్, నవభారత్, బిటిపిఎస్, హెవీ వాటర్ ప్లాంట్ లాంటి అనేక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ఉండటం వల్ల ఇది ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా ఉందన్నారు. ఈ రోడ్డు పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు లాంటి పారిశ్రామిక ప్రాంతాలను కలపడమే కాకుండా, అంతర్జాతీయ పుణ్యక్షేత్రమైన భద్రాచలం చేరుకోవడానికి భక్తుల మార్గాన్ని సులభతరం చేస్తుందని పేర్కొన్నారు. దీనిని జాతీయ రహదారిగా మార్చడం వల్ల తూర్పు, మధ్య తెలంగాణ మధ్య రవాణా మెరుగై, బొగ్గు రవాణా సులభతరమవుతుందని, గ్రామీణ ప్రాంతాల సామాజిక-ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. జగ్గయ్యపేట వద్ద ఎన్ హెచ్-65 కి అనుసంధానం కావడం ద్వారా ప్రధాన మార్కెట్లకు లింక్ ఏర్పడుతుందని, ప్రాధాన్యత ప్రాతిపదికన ఈ నవీకరణ పనులను చేపట్టాలని కేంద్ర, రాష్ట్ర మంత్రులను అయన సమర్పించిన లేఖలో పేర్కొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ