తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు. బుధవారం సాయంత్రం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్లు, ప్రక్రియలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ- జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలను మూడు విడతలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో భాగంగా రేపటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 29 సాయంత్రం 5 గంటలని పేర్కొన్నారు. మొదటి విడతలో మారుమూల, సమస్యాత్మక ప్రాంతాలను ప్రాధాన్యంగా తీసుకుని చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, అశ్వాపురం, బూర్గంపాడు , పినపాక, మణుగూరు, కరకగూడెం మండలాల పరిధిలోని 159 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపుచేసి ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో అన్నపురెడ్డిపల్లి, అశ్వరావుపేట, చంద్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి, చుంచుపల్లి, పాల్వంచ మండలాల్లోని 156 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. మూడవ విడతలో ఆళ్లపల్లి, గుండాల, జూలూరుపాడు, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, ఇల్లందు మండలాల్లోని 156 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 4,242 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, నామినేషన్ల స్వీకరణ కోసం 137 కేంద్రాలను ఏర్పాటు చేశామని, మొదటి విడతలో 47 నామినేషన్ కేంద్రాల్లో రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉన్నారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను గుర్తించి పోలీస్ శాఖతో సమన్వయం చేసి బలగాల మోహరింపు, వెబ్ కాస్టింగ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడతామని తెలిపారు. తప్పుడు సమాచారంపై నిఘా బలోపేతం చేసామని, అపోహలు, ఉద్రిక్త పరిస్థితులకు అస్సలు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, ఇది మున్సిపాలిటీ ప్రాంతాలకు వర్తించదని ప్రజలు అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రచారానికి సంబంధించి పత్రికా ప్రకటనలు, కరపత్రాలు, ప్రచార సామగ్రి ముద్రణ ఖర్చులను అభ్యర్థులు తప్పనిసరిగా వెల్లడించాలని సూచించారు. ప్రింటింగ్ ప్రెస్లు, జిరాక్స్ సెంటర్లు ముద్రించిన పత్రికా, కరపత్రాలపై ప్రతులు సంఖ్య, ముద్రణ వివరాలు స్పష్టంగా ముద్రించాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని అన్ని అభ్యర్థులు, రాజకీయ నాయకులకు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్ఠానికి, గ్రామస్థాయిలో పారదర్శకతకు జిల్లా పరిపాలన కట్టుబడి ఉందని ఆయన అన్నారు. జిల్లాలో ఎన్నికలను విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని కార్యాచరణలు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ