తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి రైతులకు నష్టం లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలి – ఉత్తంకుమార్ రెడ్డి ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కలెక్టర్లు కృషి చేయాలి – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియపై హైదరాబాద్ నుండి పలువురు మంత్రులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రిపొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక శాఖ,పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖల మంత్రి వాకాటి శ్రీహరి,ఐటీ,పరిశ్రమలు & వాణిజ్యంశాఖల మంత్రి శ్రీధర్ బాబు, గృహ నిర్మాణం, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ, వృద్ధుల సంక్షేమ, మరియు ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖల మంత్రి అట్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల ప్రభావంతో ధాన్యం తడిచే పరిస్థితులు ఏర్పడుతున్నందున రైతులు నష్టపోకుండా ముందస్తు జాగ్రత్తలు అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు. వాతావరణ సూచనలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వర్ష సూచనలు ఉన్నప్పుడల్లా వెంటనే రైతులకు సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామ స్థాయి వరకు వ్యవసాయ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండి రైతులను ముందుగానే హెచ్చరించాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని సదుపాయాలు సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా టార్పాలిన్లు, గిడ్డంగి సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు. వర్షం వచ్చే సూచనలు ఉన్నప్పుడు ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి గింజను కొనుగోలు చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిట్టచివరి రైతు వరకూ న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని స్పష్టం చేశారు.రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున అన్ని జిల్లాల్లో ముందస్తు చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని, ధాన్యం, మొక్కజొన్న సహా ప్రతి రైతు ఉత్పత్తిని కొనుగోలు చేసి చిట్టచివరి రైతుకు కూడా న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఈ మే నెల ధాన్యం కొనుగోలుకు అత్యంత కీలకమని, అధికారులందరూ సమన్వయంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియను విజయవంతం గా పూర్తి చేయాలని అన్నారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల కలెక్టర్లు ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత బాధ్యతతో, సమన్వయంతో నిర్వహించాలని సూచించారు. ఈ సీజన్లో గత రెండు సీజన్లతో పోలిస్తే అధికంగా ధాన్యం ఉత్పత్తి నమోదైనందున, కొనుగోలు ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని, ప్రతి అంశాన్ని నిరంతరం సమీక్షిస్తూ పరిస్థితిని అదుపులో ఉంచాలని అన్నారు . కొనుగోలు కేంద్రాల్లో ఏర్పడే చిన్న చిన్న సమస్యలను కూడా వెంటనే గుర్తించి పరిష్కరించేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే సంబంధిత ఇంచార్జి మంత్రులకు తెలియజేసి తక్షణ చర్యలు తీసుకునేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా కొనసాగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ధాన్యం రవాణాలో ఎలాంటి సమస్యలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ముందస్తుగా చెయ్యాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని, టార్పాలిన్ల కొరత లేకుండా చూసుకోవాలని, రైస్ మిల్లర్లతో సమన్వయం పెంచాలని అన్నారు. అవసరమైన గోదాములు లేదా మార్కెట్ యార్డ్ షెడ్యూల్లో ధాన్యం భద్రపరచాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఐడీఓసీ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ అదనపు కలెక్టర్ వేణుగోపాల్తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వరి మరియు మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి స్థాయిలో నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 92 కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం చేరుకున్నదని, వెంటనే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ధాన్యం కొనుగోలు పూర్తైన 24 గంటల్లోపే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసిన రైతులకు వారం రోజుల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు విద్యాచందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్ బాబు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ